ఆలోచన ఘనం.. నిర్మాణం శూన్యం!  | Sakshi
Sakshi News home page

ఆలోచన ఘనం.. నిర్మాణం శూన్యం! 

Published Fri, Mar 15 2019 11:34 AM

Construction Of The Mega Tourism Project Did Not Begin - Sakshi

సాక్షి, గుంటూరు: సుమారు 500 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూముల్లో సర్వే నిర్వహించి ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని కేటాయించేందుకు రెవెన్యూశాఖ చర్యలు చేపట్టింది. అనంతరం వైఎస్సార్‌ అకాల మరణం, తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన కె.రోశయ్య మైసూరులోని బృందావన్‌ గార్డెన్స్, బెంగళూరులోని లాల్‌బాగ్‌ గార్డెన్‌ల తరహాలో ఇక్కడ అత్యాధునికంగా పార్కును అభివృద్ధి చేయాలని సంకల్పించారు.

అప్పటి పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి నూతన పర్యాటక విధాన ముసాయిదాను ఆమోదించారు. పర్యాటక అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిచాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఈ ప్రాజెక్టు భూములను అనేక సార్లు పర్యాటకశాఖ అధికారులు సందర్శించి హైదరాబాద్, ముంబాయి నగరాలకు చెందిన ఆర్కిటెక్చర్స్‌తో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నిధుల విడుదలలో నెలకొన్న జాప్యంతో ప్రాజెక్టు నిలిచిపోయింది.

టీడీపీలో రేటు మారింది
మెగా టూరిజం ప్రాజెక్టుకు తెలుగుదేశం ప్రభుత్వం 2015లో  250 ఎకరాల స్థలాన్ని కేటాయించి దశల వారీగా మరికొంత  స్థలంతో పాటు నిధులు మంజూరు చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీనిచ్చింది. 2013లో టూరిజం శాఖ మెగా టూరిజం ప్రాజెక్టు స్థలాన్ని కేటాయించమని కోరినప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఎకరం 1.80లక్షల రూపాయలు ఉండగా  ప్రస్తుతం ఎకరం 2.50లక్షల రూపాయలుగా పెరిగింది. 

చూసి వెళ్తున్నారు..
టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్‌ భాగస్వామ్యంతో మెగా టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి పర్చాలని భావించింది. ఈ నేపథ్యంలో 2015 డిసెంబర్‌ 29న ముంబాయి ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌చంద్ర తన సొంత హెలికాఫ్టర్‌లో మెగా టూరిజం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి ఈ ప్రాంతం ఎంతో నచ్చిందని చెప్పటంతో ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ పడినట్లయ్యింది. 2017 ఫిబ్రవరిలో కూడా ఎస్‌ఎల్‌ గ్రూపు ప్రతినిధులు మరో సారి మెగాటూరిజం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు వారు చూసి వెళ్లడమే కానీ ప్రాజెక్టు నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. 

ఎన్నెన్నో అందాలు..
విజయపురిసౌత్‌ పరిధిలో చూడచక్కని చారిత్రక ప్రదేశాలైన నాగార్జునకొండ, అనుపు, ఎత్తిపోతల జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. దేశ, విదేశీ పర్యాటకులు కారులో ఇక్కడకి చేరుకోవాలంటే హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానశ్రయం నుంచి కేవలం రెండున్నర గంటల సమయం పడుతుంది. ఇక్కడ ఇన్ని సౌకర్యాలతో పాటు కనువిందు చేసే ప్రకృతి అందాలకు తోడు మెగా టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి. మెగా టూరిజం ప్రాజెక్టులో చూడచక్కని అందాలతో ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులు, సినిమా స్టూడియోలు, స్విమ్మింగ్‌పూల్స్, స్టార్‌ హోటళ్లు పర్యాటకులకు అందుబాటులోకి వస్తాయి. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతమైన విజయపురిసౌత్‌లో వందలాది ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఇక్కడ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే సినీ పరిశ్రమకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.  తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో ఇచ్చిన హామీకి ఇప్పటి వరకు మోక్షం లభించలేదు.
 

Advertisement
Advertisement