అవిభక్త కవలలు వీణా, వాణీల పదో పుట్టిన రోజు వేడుకలు మంగళవారం నిలోఫర్ ఆసుపత్రిలో జరిగాయి. ఆసుపత్రి వైద్యులు, అధికారులు, సిబ్బంది కలిసి కేక్ కట్ చేసి వీణా, వాణీలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
నిలోఫర్లో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన సిబ్బంది
హైదరాబాద్, న్యూస్లైన్: అవిభక్త కవలలు వీణా, వాణీల పదో పుట్టిన రోజు వేడుకలు మంగళవారం నిలోఫర్ ఆసుపత్రిలో జరిగాయి. ఆసుపత్రి వైద్యులు, అధికారులు, సిబ్బంది కలిసి కేక్ కట్ చేసి వీణా, వాణీలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గత పదేళ్లుగా వీరు నిలోఫర్ ఆసుపత్రి గోడల మధ్యే ఉంటున్నారు.
వరంగల్కు చెందిన మురళి, నాగలక్ష్మీ దంపతులకు 2003లో వీణా, వాణీ జన్మించారు. తలలు అతుక్కుని పుట్టడంతో మూడు రోజులకే గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత నిలోఫర్ ఆసుపత్రికి వచ్చారు. గతంలో వీరి తలలను వేరు చేసేందుకు ముంబైలోని బ్రీచ్క్యాండీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు చేయించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే అవిభక్త కవలలను పరీక్షించిన వైద్యులు చేతులెత్తేశారు. సింగపూర్కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ కిత్గో కూడా శస్త్రచికిత్స చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయన నిలోఫర్ ఆసుపత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించారు. కానీ వారిని వేరు చేయడంపై వందశాతం హామీ ఇవ్వకపోవడంతో నిలోఫర్ ఆసుపత్రి వర్గాలు వెనుకంజ వేశాయి. అప్పట్నుంచి వీణా, వాణీలు నిలోఫర్ ఆసుపత్రిలోనే ఉంటున్నారు.