మాట ఇచ్చి మర్చిపోయారు! | chandrababu naidu forgotten his promise | Sakshi
Sakshi News home page

మాట ఇచ్చి మర్చిపోయారు!

Jul 8 2014 6:24 PM | Updated on Aug 14 2018 4:44 PM

మాట ఇచ్చి మర్చిపోయారు! - Sakshi

మాట ఇచ్చి మర్చిపోయారు!

మాట ఇచ్చి మర్చిపోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు.

మాట ఇచ్చి మర్చిపోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు. ప్రజలకిచ్చిన హామీలను గాలికి వదిలేయడంలో తనను మించిన వారు లేరని మరోసారి రుజువు చేశారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. వారంలో నాలుగు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటానని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు.. ఏపీ ప్రజలకు వాగ్దానం చేశారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కి నెల రోజులైనా ఆయన ఈ మాట నిలబెట్టుకోలేదు.

ఈ నెల రోజుల్లో మూడుసార్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఆయన రెండుసార్లు అధికారులతో సమావేశానికే పరిమితమయ్యారు. ఇదే సమయంలో నాలుగు పర్యాయాలు ఢిల్లీకి వెళ్లొచ్చారు. చంద్రబాబు ఎంతో చేస్తారని ఆశించి టీడీపీని ప్రజలు గెలిపించారని, వారి ఆశలను ఆయన వమ్ము చేశారని గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సేవ కుమార్ అన్నారు. ప్రజలకు ఆయన అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటే.. విభజన కారణంగా బెంగటిల్లుతున్న ఏపీ ప్రజలకు మనోధైర్యం కలిగేదని అభిప్రాయపడుతున్నారు.

తీరికలేని పనుల కారణంగానే ప్రజలకు చంద్రబాబు అందుబాటులో ఉండలేకపోతున్నారని మంత్రి ప్రతిపాటి పుల్లారావు చెప్పారు. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ముఖ్యమంత్రి తప్పకుండా జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన తెలిపారు. పంటల రుణమాఫీపై కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్న చంద్రబాబు తమకిచ్చిన మాటపై ఏంచేస్తారోనని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement