ఎక్కడో.. చంపి ఇక్కడకు తెచ్చి.. | Brutal murder of an unidentified young man | Sakshi
Sakshi News home page

ఎక్కడో.. చంపి ఇక్కడకు తెచ్చి..

Aug 12 2014 3:44 AM | Updated on Aug 1 2018 2:35 PM

ఎక్కడో.. చంపి ఇక్కడకు తెచ్చి.. - Sakshi

ఎక్కడో.. చంపి ఇక్కడకు తెచ్చి..

గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన వేటపాలెంలో ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది.

వేటపాలెం :  గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన వేటపాలెంలో ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది. వివరాలు.. చీరాల - ఒంగోలు రోడ్డులో గతంలో కనకదుర్గా వైన్స్ నిర్వహించిన భవనం, దాని పక్కనే మరో వ్యక్తి ఇంటికి మధ్య కొద్దిపాటి ఖాళీ స్థలం ఉంది. అక్కడి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని టైలర్ సోమేశ్వరరావు గమనించాడు. అక్కడ గుర్తుతెలియని యువకుని మృతదేహం ఉండటంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీరాల సీఐ ఫిరోజ్, ఎస్సై జి.రామిరెడ్డిలు హుటాహుటిన వచ్చి మృత దే హాన్ని పరిశీలించారు.
 
మృతుని శరీరంపై దుప్పటి కప్పి ఉంది. దుప్పటి తొలిగించి చూడగా దుస్తులు లేవు. మెడకు తాడు బిగించి ఉంది. రెండు కాళ్లు కలిపి తాడుతో కట్టి ఉంది. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతునికి సుమారు 35 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. మృదేహం ఉబ్బి ముఖం గుర్తు పట్టేందుకు వీల్లేకుండా ఉంది. హత్య జరిగి రెండు రోజులై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడకు తెచ్చి పడేసినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ నరహర పరిశీలించారు.
 
చుట్టపక్కల కలియదిరిగిన డాగ్ స్క్వాడ్
ఒంగోలు నుంచి డాగ్ స్క్వాడ్ వచ్చింది. హంతకుల ఆధారాల కోసం రూబీ (పోలీసు కుక్క) చుట్టుపక్కల కలియదిరిగింది. మృతదేహం నుంచి పాత కనకదుర్గా వైన్స్ షాపు వెనక మీదగా కూరగాయల మార్కెట్‌కు వెళ్లింది. అక్కడి నుంచి గడియార స్తంభం సెంటర్ మీదుగా ఒన్‌వే రోడ్ వైపునకు మళ్లింది. తిరిగి పోస్టాఫీస్ రోడ్డు మీదుగా చీరాల -ఒంగోలు రోడ్డుకు వచ్చి మళ్లీ సంఘటన స్థలం చేరుకుని ఆగింది. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
 
స్థానికుల్లో భయాందోళన
వేటపాలెం ప్రధాన సెంటర్‌కు దగ్గరలో నివాసాలు అధికంగా ఉండే ప్రాంతంలో గుర్తుతెలియని యువకుడి హత్య సంచలనం సృష్టించింది. స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిత్యం ర ద్దీగా ఉండే ప్రాంతంలో మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement