సీఎం సభావేదికపై గూండాలా? | botsa satyanarayana on tdp | Sakshi
Sakshi News home page

సీఎం సభావేదికపై గూండాలా?

Jan 5 2018 2:43 AM | Updated on Jul 12 2019 3:10 PM

botsa satyanarayana on tdp - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి పాల్గొన్న జన్మభూమి సభా వేదికపైకి రౌడీలు, గూండాలు రావడమేమిటని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విస్మయం వ్యక్తం చేశారు. సభా వేదికపైకి వచ్చిన రౌడీషీటర్లతో పాటు వారిని ప్రోత్సహించిన అధికారులు, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే పులివెందుల సభలో ఎంపీ అవినాష్‌రెడ్డిని మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడంపై బొత్స మండిపడ్డారు.

ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జన్మభూమి అధికారిక కార్యక్రమమని చెప్పిన చంద్రబాబు.. మరి ఎంపీ అవినాష్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసేందుకు ఎందుకు ప్రయత్నించారో చెప్పాలన్నారు. సభకొచ్చినప్పటికీ అవినాష్‌రెడ్డిని మాట్లాడని వ్వకుండా చంద్రబాబు మైక్‌ లాక్కోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

స్థానిక ఎంపీతో మాట్లాడించాలన్న కనీస మర్యాద చంద్రబాబుకు తెలియకపోవడం శోచనీయమన్నారు. అవినాష్‌రెడ్డి సభలో ఎవరినీ దుర్భాషలాడలేదని.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించే ప్రయత్నం మాత్రమే చేశారన్నారు. అంతమాత్రాన మైక్‌ లాక్కోవాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు.టీడీపీ ప్రభుత్వం పదేపదే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనమన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement