తెలంగాణ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని టీజేఏసీని బీజేపీ రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేసింది.
* టీ జేఏసీకి రాష్ట్ర బీజేపీ నేతల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని టీజేఏసీని బీజేపీ రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేసింది. టి.బిల్లును రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించడం, సీఎం కిరణ్ దీక్ష చేస్తాననడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ బిల్లును పార్లమెంటులో ఎలా ప్రవేశపెడతారంటూ తమ పార్టీ నాయకురాలు, లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ చేసిన వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించిందని వివరణ ఇచ్చారు.
మంగళవారం ఇక్కడ జరిగిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం సందర్భంగా సుష్మ మీడియాతో మాట్లాడిన దృశ్యాలను ప్రత్యేకంగా ప్రదర్శించారు. మీడియా వక్రీకరణను నమ్మడం లేదని ప్రకటించాల్సిందిగా జేఏసీ నేతల్ని ప్రత్యేకించి కోదండరాంను బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నేత డాక్టర్ టి.రాజేశ్వరరావు పదేపదే కోరారు.
దీంతో కోదండరాం స్పందిస్తూ ‘తెలంగాణకు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, ఆర్ఎల్డీ సహా అనేక పార్టీలు మద్దతిస్తున్నాయి. తెలంగాణకు అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి. తెలంగాణవాదులకు అనుమానాలు వద్దు. మాకూ అనుమానాలు లేవు. ఉద్యమంలో ఇట్లాంటివి మామూలే. ఇది కొత్తాకాదు, చివరిసారీ కాదు’ అని వ్యాఖ్యానించారు.