పందేల ‘జాతర’ | big wings launch cock fights in AP | Sakshi
Sakshi News home page

పందేల ‘జాతర’

Jan 17 2015 1:23 AM | Updated on Sep 2 2017 7:46 PM

పందేలను ప్రారంభిస్తున్న మంత్రి ప్రత్తిపాటి

పందేలను ప్రారంభిస్తున్న మంత్రి ప్రత్తిపాటి

అనధికార మద్యం షాపులు, కోడి పకోడి, బిర్యాని స్టాల్స్, పండ్లు, ఫలహారశాలలతో కోడి పందేల ప్రాంతాలు తిరునాళ్లను తలపించాయి.

నెత్తురోడిన వేలాది పందెం కోళ్లు.. చేతులు మారిన రూ.450 కోట్లు

సాక్షి, విజయవాడ బ్యూరో: షామియానాలు .. ఫ్లడ్‌లైట్ల కాంతులు.. వీఐపీ గ్యాలరీలు.. ఇదీ కోడి పందేలా జాతర తీరు. అనధికార మద్యం షాపులు, కోడి పకోడి, బిర్యాని స్టాల్స్, పండ్లు, ఫలహారశాలలతో కోడి పందేల ప్రాంతాలు తిరునాళ్లను తలపించాయి. మూడు రోజులపాటు సాగిన కోడిపందేల్లో సుమారు రూ.450 కోట్లు చేతులు మారినట్లు అనధికారిక అంచనా.

పశ్చిమగోదావరి జిల్లాలో ఇక్కడి ప్రముఖుల ఆహ్వానంతో హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక నుంచి బడాబాబులు తరలివచ్చారు. తణుకులో సినీ సంగీత దర్శకుడు కోటి, దర్శకుడు కోదండరామిరెడ్డి, నిర్మాత ఎంఎస్ రాజు కోడిపందేలను తిలకించారు. వెంప బరిలో పందేలను సినీనటుడు శ్రీకాంత్‌తోపాటు బుల్లితెర నటీనటులు తిలకించారు. నిడదవోలు సమీపంలోని శింగవరం గ్రామంలో సినీ నటుడు శివాజీరాజా హాజరయ్యారు. వేల్పూరు, దువ్వ, తేతలిలో నిర్వహించిన కోడి పందేలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తిలకించారు.

ఉండి నియోజకవర్గంలో పారిశ్రామిక వేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు, విజయవాడ ఎంపీ కేసినేని నాని, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకరరెడ్డి, తణుకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజ, తెలంగాణకు చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఎం. కృష్ణారావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి, సినీ అర్టిస్ట్ శ్రవణ్ ఆసక్తిగా తిలకించారు

పత్తాలేని పోలీసులు..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత జిల్లా అయిన తూర్పు గోదావరిలో పోలీసులు పట్టించుకోకపోవడంతో కోడి పందేలు, పేకాట పెద్ద ఎత్తున సాగాయి. కొవ్వాడలోని కోడి పందేల బరి వద్ద స్థానిక, స్థానికేతరులు ఘర్షణకు దిగి కత్తులతో పొడుచుకోవడంతో గాయాలపాలైన 8మందిని ఆస్పత్రికి తరలించారు.

రాజకీయ ప్రోత్సాహం..
రాజధాని ప్రాంతమైన కృష్ణా-గుంటూరు జిల్లాల్లో మునుపెన్నడూలేని విధంగా కోడి పందేలకు రాజకీయ ప్రోత్సాహం అందింది. కైకలూరు నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు పలు గ్రామాల్లో తిరిగి కోడి పందేల బరుల వద్ద నిర్వాహకులను ప్రోత్సహించారు.మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలే రంగంలోకి దిగడంతో పందేలు పెచ్చుమీరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement