విదేశీ కంపెనీలకు భూముల ధారాదత్తం


పోలాకి:మండలంలోని థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రతిపాదిత గ్రామాల్లో సీపీఐ నాయకులు ఆదివారం పర్యటించారు. మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ అధ్యక్షతన తోటాడ, సన్యాసిరాజుపేట, ఓదిపాడు, చీడివలస గ్రామాల్లో పర్యటించి థర్మల్ పవర్‌ప్లాంట్‌పై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇందులో భాగంగా సన్యాసిరాజుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో విల్సన్ మాట్లాడుతూ విదేశీ కంపెనీల మోజులో రైతుల హక్కులకు భంగం కలిగే నిర్ణయాలను సీఎం చంద్రబాబు తీసుకుంటున్నారన్నారు.

 

 రాజధానితో పాటు వివిధ పరిశ్రమల నిర్మాణంలో ప్రభుత్వ, రైతుల భూములు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. పోలాకి థర్మల్ పవర్‌ప్లాంట్‌పై రహస్య సర్వేలు చేస్తున్నట్టు వ స్తున్న వార్తలపై కలెక్టర్ గాని, జిల్లాకు చెందిన మంత్రి గాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాపర సుందరలాల్ మాట్లాడుతూ పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీ సంఘం నాయకులు లండ వెంకటరావు, గేదెల చిరంజీవులు, బి.త్రినాథరావు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top