విద్యార్థుల ఆకలి కేకలు | BC Students Protest For Food In PSR Nellore | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆకలి కేకలు

Jul 12 2018 12:29 PM | Updated on Jul 12 2018 12:29 PM

BC Students Protest For Food In PSR Nellore - Sakshi

రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు

నెల్లూరు రూరల్‌:  విద్యార్థులకు భోజనం పెట్టకుండా వార్డెన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆ వార్డెన్‌ మాకొద్దు అంటూ బీసీ కళాశాల బాలుర వసతిగృహ విద్యార్థులు రోడ్డెక్కారు. కొత్తూరు రామకోటయ్య నగర్‌లోని బీసీ కళాశాల బాలుర వసతిగృహ విద్యార్థులకు బుధవారం ఉదయం టిఫిన్‌ పెట్టలేదు. వార్డెన్‌ వంట మనిషిని వెనక్కు పంపడంతో అల్పాహారం అందలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానిక కొండాయపాళెం గేటు సెంటర్‌లోని జిల్లా బీసీ సంక్షేమాధికారి కార్యాలయం ఎదట ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఈ వార్డన్‌ మా కొద్దు, వార్డెన్‌ వెంకట్రావుపై చర్యలు తీసుకో వాలని, పెరిగిన మెస్‌ చార్జీలకు అనుగుణంగా మె నూ మార్చాలని, సక్రమంగా భోజనం పెట్టాలని, హాస్టల్‌లో వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

అనంతరం డీబీసీడబ్లూఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి కె.రాజేశ్వరి విద్యార్థులతో చర్చిం చారు. ఈ ఘటనపై 15 రోజుల్లో విచారించి వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతినిధులు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెస్‌ చార్జీలు పెంచిందని, పెరిగిన మెస్‌ చార్జీలకు అనుగుణంగా సవరించిన మెనూ ప్రకారం భోజనం పెట్టమంటే వార్డెన్‌ విద్యార్థులపై దాడికి దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన విద్యార్థులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం రాత్రి మెనూ ప్రకారం బుధవారం ఉదయం టిఫిన్‌ రెడీ చేయాలని మెస్‌ కమిటీ సభ్యులు కోరడంతో నానా దుష్పలాడారని పేర్కొన్నారు.  బుధవారం ఉదయం టిఫిన్‌ తయారు చేయకుండా వంట మనిషిని వెనక్కు పంపించారన్నారు. కాంగ్రెస్‌ బీసీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ గాలాజు శివాచారి, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గంపాటి పద్మజ విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు. విద్యార్థుల న్యాయమైన కోర్కెలను తీర్చాలని అధికారులకు విన్నవించారు.

Advertisement
 
Advertisement
Advertisement