ఆటో ఇంజన్లు మార్చే..ముఠా గుట్టురట్టు


 నర్సాపూర్, న్యూస్‌లైన్: ఆటో ఇంజన్లు మార్చి విక్రయించే ముఠా గుట్టును నర్సాపూర్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి  ఏడు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.  స్థానిక సీఐ సీహెచ్ సైదిరెడ్డి శనివారం ముఠా కార్యకలాపాలు విలేకరులకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం...మెదక్‌కు చెందిన సిద్దిరాములు మెదక్‌లోని టాటా ఫైనాన్స్ సంస్థలో రికవరీ ఏజెంటుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే టాటా ఫైనాన్స్ ద్వారా ఆటోలు తీసుకుని కిస్తీలు చెల్లించని వారి ఆటోలను సిద్దిరాములు సీజ్ చేసేవాడు. అనంత రం తన మిత్రులు టేక్మాల్ మండలం శేరిపల్లికి చెందిన రాజాగౌడ్, నర్సాపూర్‌కు చెందిన మహమ్మద్‌పాషాలతో కలిసి కొత్త ఆటోల ఇంజన్‌లను తీసివేసి, వాటికి పాత ఇంజన్‌లను అమర్చేవారు. కొత్త ఆటోల నుంచి తీసిన ఇంజన్‌లను అమ్ముకుని డబ్బు పంచుకునేవారు.

 

  ఈ క్రమంలోనే ఫిర్యాదు రాగా, పోలీసులు దర్యా ప్తు చేయడంతో ఈ ముఠా గుట్టురట్టయ్యింది. దీంతో పోలీసులు ఈ కేసులో నిందితులైన నర్సాపూర్‌కు చెంది న మహమ్మద్‌పాషా, నీరుడి విక్రం, అన్వర్‌బేగ్, జావీ ర్, ఫయాజ్‌లతోపాటు శేరిపల్లికి చెందిన రాజాగౌడ్, మెదక్‌కు చెందిన సిద్దిరాములు, నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటకు చెందిన నర్సింలుగౌడ్, హత్నూరకు చెందిన రఫీక్, ఎర్రగడ్డకు చెందిన సజ్జర్‌హుస్సేన్, రాజులను అరెస్టు చేసి రిమాండుకు పంపారు. మరో ముగ్గురు నిందితులు నాగిరెడ్డి, చందు, జిన్నారంకు చెం దిన పెంటయ్యలు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. పరారీలో ఉన్న వారు దొరికితే ఇంజన్లు మార్పు చేసిన మరిన్ని ఆటోలు దొరుకుతాయని భావిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ఆటో ఇంజన్‌లను మార్చే ముఠా గుట్టురట్టు చేసిన ఎస్‌ఐ పాలవెల్లితో పాటు సిబ్బందిని సీఐ ఈ సందర్భంగా అభినందించారు.

 

 ఇంజన్ మార్పిడిలో తలోచేయి

 టాటా ఫైనాన్స్ సంస్థ తమకు వాయిదాలు బకాయిపడిన ఆటో యజమానుల జాబితాను సిద్దిరాములుకు ఇచ్చేవారు. వాస్తవంగా ఆటోలను పట్టుకొని రంగారెడ్డి జిల్లా కొంపల్లిలో గల ఆటోయార్డులో అప్పగించాలి. కానీ సిద్దిరాములు తాను స్వాధీనం చేసుకున్న ఆటోలను తన మిత్రుడైన రాజాగౌడ్‌కు అప్పగించేవాడు. రాజాగౌడ్ మిత్రుడైన మహమ్మద్‌పాషా సహకారంతో కొత్త ఆటో ఇంజన్‌ను తీసి పాత ఇంజన్‌ను అమర్చి ఇచ్చేవారు. సిద్దిరాములు ఆ ఆటోను టాటా ఫైనాన్స్‌కు చెందిన కొంపల్లిలోని యార్డులో అప్పగించే వాడు. ఆటో నుంచి తొలగించిన కొత్త ఇంజన్‌ను అమ్మగా వచ్చే సొమ్మును సిద్దిరాములు, రాజాగౌడ్, మహమ్మద్‌పాషాలు పంచుకునే వారు. ఆటోల నుంచి ఇంజన్ తొలగించి పాత ఇంజన్‌ను బిగించేందుకు హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన మెకానిక్‌లు సజ్జర్‌హుసేన్, రాజులను ఉపయోగించుకునేవారు. ఇలా ఇంజన్‌లను మార్చి సొమ్ము చేసుకునేవారు. ఇలా ఆటో ఇంజన్‌ల మార్పిడితో సొమ్ములు సంపాదించవచ్చని తెలుసుకున్న సంగారెడ్డిలోని టాటా ఫైనాన్స్ సంస్థలో రికవరీ ఏజెంటుగా పనిచేసే నాగిరెడ్డి సైతం రాజాగౌడ్‌కు పలు ఆటోలు అప్పగించారు. దీంతో రాజాగౌడ్ మిత్రుడు చందు సహకారంతో ఇంజన్లు మార్చేసి అమ్మేవాడు.

 

 ఫిర్యాదు చేస్తే పట్టుకుంటాం...

 ఫైనాన్స్‌ల నుంచి రుణాలు పొంది కొత్త ఆటోలను కొనుగోలు చేసే కొందరు వ్యక్తులు ఇంజన్లు తొలగించి వాటి  స్థానంలో పాత ఇంజన్లు అమరుస్తున్నారనీ, ఆ తర్వాత వాయిదాలు ఎగ్గొడుతూ ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తెలిసిందని సీఐ సైదిరెడ్డి తెలిపారు. వీరి వివరాలను ఆయా  ఫైనాన్స్ సంస్థలకు సమాచారం ఇచ్చామనీ, ఆ సంస్థల వారు ఫిర్యాదు చేస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top