చంద్రబాబు భారీ మూల్యం చెల్లించక తప్పదు: మంత్రులు

AP Minister Adimulapu Suresh Condemns Attack On Pinnelli Ramakrishna Reddy - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. హేయమైన చర్యగా ఆయన వర్ణించారు. పిన్నెల్లిపై దాడికి టీడీపీ బాధ్యత వహించాలని మంత్రి డిమాండ్‌ చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నాయకులు ఈ దాడిలో పాల్గొన్నారని అన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని టీడీపీ భావిస్తోందని విమర్శించారు. ప్రణాళికా ప్రకారమే టీడీపీ గుండాలు ఈ దాడికి దిగారని మంత్రి మండిపడ్డారు. (పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం)

చంద్రబాబుకు చెందిన రౌడీలే పిన్నెల్లి పై దాడి చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్టాడుతూ.. ‘రాజధానిలో ఎమ్మెల్యేలు పర్యటిస్తే దాడులు చేస్తారా?. విధ్వంసం సృష్టించి అల్లర్లు చేయించాలని చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు చూస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా..? శాసన రాజధాని ఇక్కడే ఉంటుంది అని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అలాంటి ప్రాంతంలో ఎమ్మెల్యేలను పర్యటించనివ్వరా..? చంద్రబాబు గుండాలు రైతుల ముసుగులో దాడులు చేశారు. రైతులు ఎవ్వరైనా రాళ్లు విసిరి, గన్‌మ్యాన్‌లను కొడతారా. ఇలాంటి దాడులను ప్రభుత్వం ఉపేక్షించదు. చంద్రబాబు దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాయలసీమ ప్రజలు నీళ్లు, ఉపాధి కోరుతున్నారు. ముందు చూపుతో సీఎం జగన్‌ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.’ అని పేర్కొన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top