బీసీ విద్యార్థులకు సర్కారు బొనాంజ

AP Govt Financial aid to bc students for foreign education - Sakshi

విదేశీ విద్యకు ఆర్థికసాయం 

రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంపు

ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి.. 

ప్రపంచంలో టాప్‌–100 యూనివర్సిటీల్లో విదేశీ విద్యకు అనుమతి

వెనుకబడిన తరగతుల వారికి విదేశీ విద్య కింద అందజేసే ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఈ ఉత్తర్వులతో ఎంతోమందికి బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఇది అమలుకానుంది. విదేశాల్లో చదువుకునేందుకు దరఖాస్తు చేసి ఇటీవల ఎంపికైన వారికి ఈ మొత్తం అందనుంది. ఆర్థిక సాయం పెంపుతో బీసీ వర్గాల్లో  హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.    
    –సాక్షి, అమరావతి 

ఎంపిక విధానం
- ఏపీ ఈపాస్‌లో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దరఖాస్తు చేసుకోవాలి. 
33 శాతం మహిళలకు రిజర్వు చేస్తారు. 
వారు లేని పక్షంలో పురుషులకు అవకాశం కల్పిస్తారు. 
బీసీల్లో ఏ, బీ, డీ గ్రూపుల వారికి నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ వర్తిస్తుంది. 

ఆర్థిక సాయానికి నిబంధనలివీ..
పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివేందుకు వీలుగా ఏటా వెయ్యి మందికి ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు..
అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం ఆరు లక్షలలోపు ఉండాలి. ఉద్యోగుల పిల్లలు కూడా ఈ పథకానికి అర్హులు. అయితే, వారి సంవత్సర ఆదాయం కూడా ఆరు లక్షలకు మించకూడదు. 
దరఖాస్తు చేసిన సంవత్సరం జూలై ఒకటి నాటికి అభ్యర్థి వయస్సు 35 ఏళ్లకు మించరాదు. 

ఏఏ దేశాల్లో చదువుకోవచ్చు
అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, డెన్‌మార్క్, రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, చైనా (ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, చైనా దేశాల్లో కేవలం మెడిసిన్‌ చదువుకునేందుకు మాత్రమే అనుమతి).

సెలక్షన్‌ కమిటీలో ఎవరెవరు 
కమిటీ చైర్మన్‌గా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉంటారు. సభ్యులుగా ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి, జేఎన్‌టీయూ వైస్‌ చాన్స్‌లర్, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఉంటారు. 

స్కాలర్‌షిప్‌ ఇచ్చే విధానం
- విద్యార్థి ల్యాండింగ్‌ పర్మిట్‌ చూపించగానే రూ.5లక్షలు మొదటి దఫాగా ఇస్తారు. 
సెప్టెంబర్‌ రిజల్ట్‌ రాగానే రెండో దఫా రూ.5లక్షలు ఇస్తారు. 
చదువుకున్న విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 

గతంలో ఇలా..
రూ.10 లక్షలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇచ్చేవారు.
ప్రపంచంలోని 15 యూనివర్సిటీలు, కాలేజీల్లో మాత్రమే చదువుకునేందుకు అనుమతి ఇప్పుడు ఇలా..
రూ.15 లక్షలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇస్తారు. 
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రపంచంలోని టాప్‌ 100
యూనివర్సిటీల్లో ఎక్కడైనా చదువుకోవచ్చు. 
- సీటు రాగానే అంబేడ్కర్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు అర్హులు.

మెరిట్‌ విద్యార్థులకు సువర్ణావకాశం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు దోహదపడుతుంది. తాజాగా దరఖాస్తు చేసుకున్న వారికి రూ.15లక్షల రూపాయలు అంబేడ్కర్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌ పథకంలో ఆర్థిక సాయం అందిస్తాం. విదేశాల్లో అత్యున్నత వర్సిటీల్లో బీసీ విద్యార్థులకు విద్యను అందించాలని సర్కారు భావించడం గొప్ప నిర్ణయం. మెరిట్‌ విద్యార్థులకు ఇదొక మంచి సువర్ణావకాశం.
 – బి. రామారావు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top