
సాక్షి, తాడేపల్లి: పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థకు తొలి అడుగు మహాత్ముని జయంతి రోజైన బుధవారం వేస్తున్నారు. గ్రామ సచివాలయం ప్రారంభించేందుకు బుధవారం ఉదయం ఆయన తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో కాకినాడ రూరల్ నియోజకవర్గపరిధిలోని కరప గ్రామానికి బయల్దేరారు.
సీఎం జగన్ పర్యటన వివరాలు:
⇔హెలికాప్టర్లో బయలుదేరి 10.30 గంటలకు కరపలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
⇔ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కారులో 10.35 గంటలకు కరప గ్రామ సచివాలయం వద్దకు చేరుకుంటారు. సీఎం జగన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి లోనికి తీసుకెళతారు. అక్కడ ఏర్పాటుచేసిన పైలాన్ను సీఎం ఆవిష్కరించి, గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి, సచివాలయ ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
⇔ 10.50 గంటలకు గ్రామ సచివాలయం నుంచి బయలుదేరి పక్కనే హైస్కూలు గ్రౌండులో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశ స్ధలానికి 10.55 గంటలకు చేరుకుంటారు.
⇔ 11.10 గంటల వరకు సభాస్ధలివద్ద ఏర్పాటు చేసిన స్టాఫ్ను సీఎం జగన్ సందర్శిస్తారు. అక్కడే గ్రామసచివాలయం స్టాప్తో ఇంటరాక్ట్ అవుతారు. 11.10 గంటలకు సభాస్థలికి సీఎం జగన్ చేరుకుని అక్కడ గాంధీ మహాత్ముని, మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి, దివంగతనేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం జ్యోతి వెలిగిస్తారు. వందేమాతరం ప్రార్థనతో సభా కార్యక్రమాలను ప్రారంభమవుతాయి.
⇔ 11.20 కలెక్టర్ మురళీధర్రెడ్డి ఐదు నిమిషాలు ప్రసంగించి, జిల్లా రిపోర్టు ఇస్తారు. 11.55 గంటల వరకు మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని తదితరులు ప్రసంగిస్తారు. తర్వాత ఇద్ద రు సచివాలయ ఉద్యోగులకు నియామకపత్రాలను సీఎం జగన్ అందజేస్తారు.
⇔ ఆ తర్వాత రామవరం హైస్కూలు చదువుతున్న 10వ తరగతి విద్యార్ధిని హర్షిత 4 లక్షల ముత్యాలతో రూపొందించిన నవరత్న పథకాల ప్రేమ్ను, 6వ తరగతి విద్యార్ధి సాయికిరణ్ 2,700 పేపర్ క్లిప్సింగ్స్తో తయారు చేసిన పాదయాత్ర ఆల్బమ్ను సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. తర్వాత సీఎం స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేస్తారు.
⇔ మధ్యాహ్నం 12.10 గంటలకు సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఉపన్యాస అనంతరం 1.25 గంటల వరకు పింఛన్లు, రేషన్కార్డులు, బ్యాంక్ లింకేజీ రుణాలు చెక్కులను లబ్ధిదారులకు సీఎం అందజేస్తారు. స్వచ్ఛ అవార్డులను ప్రదానం చేస్తారు.
⇔ 1.25 గంటలకు సభా స్ధలి నుంచి కారులో బయలుదేరి హెలిప్యాడ్కు చేరుకుంటారు. 1.40 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి తాడేపల్లికు చేరుకుంటారు.