పోలవరానికి వ్యతిరేక కూటమి? | Anti-Alliance to Polavaram | Sakshi
Sakshi News home page

పోలవరానికి వ్యతిరేక కూటమి?

Sep 22 2016 1:37 AM | Updated on Aug 21 2018 8:34 PM

పోలవరం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ప్రభావిత రాష్ట్రాలతో కలిసి ముందుకు వెళ్లాలని ఒడిశా రాష్ట్రంలోని అధికార బీజేడీ భావిస్తోంది.

సీజేసీ, టీఆర్‌ఎస్‌తో బీజేడీ స్నేహహస్తం

 భువనేశ్వర్: పోలవరం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ప్రభావిత రాష్ట్రాలతో కలిసి ముందుకు వెళ్లాలని ఒడిశా రాష్ట్రంలోని అధికార బీజేడీ భావిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రభావితమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే సీజేసీ, టీఆర్‌ఎస్ ఇటీవల ఉమ్మడిగా సమావేశ మయ్యాయని తెలిసింది. ఈప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే.

ప్రాజెక్ట్ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వేగవంతం చేసిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ పనుల్ని ఆపేందుకు పొరుగు ప్రభావిత రాష్ట్రాలు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో రాజకీయ శక్తులతో చేతులు కలిపేందుకు  బీజేడీ సన్నాహాలు చేపట్టింది. ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ (సీజేసీ), తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లతో స్నేహహస్తం చాచింది. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించే వర్గాల్ని కలుపుకోవడంలో అభ్యంతరం లేదని టీఆర్‌ఎస్ నేతలు చెప్పినట్లు తెలిసింది. సీజేసీ, టీఆర్‌ఎస్ ముందుకొస్తే తమకు అభ్యంతరం లేదని బీజేడీ అధికార ప్రతినిధి శశిభూషణ్ బెహరా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement