రూ.514.88 కోట్ల కాంట్రాక్టు విలువతో టెండర్ నోటిఫికేషన్ జారీ
4.09 శాతం అధికంగా రూ.535.99 కోట్లకు కోట్ చేసి పనులు దక్కించుకున్న మేఘా
అధిక ధరకు పనులు అప్పగించడం వల్ల ఖజానాపై అదనంగా రూ.21.11 కోట్ల భారం
పోలవరం ప్రాజెక్టులో 2019–24 మధ్య వైఎస్ జగన్ హయాంలో 4 టెండర్లలో ఖజానాకు రూ.686.98 కోట్లు మిగులు
జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ వ్యవస్థను రద్దు చేసిన చంద్రబాబు సర్కార్
మళ్లీ 2014–19 మధ్య అప్పటి బాబు పాలన తరహాలోనే నీరుగారిపోయిన టెండర్ల వ్యవస్థ
అంచనాలు పెంచేసి, అధిక ధరకు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు పనుల అప్పగింత
ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు ముఖ్యనేత దోచిపెట్టి నీకింత.. నాకింత.. అంటూ పంచుకుతింటున్న వైనం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో అదనపు పనుల టెండర్లలోనూ లాలూచీపర్వం బట్టబయలైంది. కాంట్రాక్టు విలువ కంటే 4.09 శాతం, 4.15 శాతం అధిక ధరకు రెండు కాంట్రాక్టు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. 4.09 శాతం అధిక ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన మేఘా సంస్థకు ఆ పనులు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలంటూ పోలవరం హెడ్ వర్క్స్ ఎస్ఈ రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ(ఎస్ఎల్టీసీ)కి ప్రతిపాదనలు పంపారు. దీనివల్ల ఖజానాపై రూ.21.11 కోట్లు అదనపు భారం పడుతుంది. ఆ మేరకు కాంట్రాక్టర్కు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన జ్యుడిíÙయల్ ప్రివ్యూ వ్యవస్థను, రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన చంద్రబాబు 2014–19 మధ్య తరహాలోనే టెండర్ల వ్యవస్థను నీరుగార్చడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలుగుతోందని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు అధిక ధరకు పనులను ప్రభుత్వ పెద్దలు అప్పగిస్తూ... దోచిపెట్టిన ప్రజాధనాన్ని నీకింత.. నాకింత.. అంటూ పంచుకుతింటున్నారని ఆరోపిస్తున్నారు. కాగా, 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జ్యుడిíÙయల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాలను అమలు చేయడం వల్ల ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే రూ.8,053,24 కోట్ల కాంట్రాక్టు విలువతో నాలుగు పనులకు వేర్వేరుగా పిలిచిన టెండర్లలో కాంట్రాక్టు విలువ కంటే తక్కువ ధరకు కాంట్రాక్టర్లు కోట్ చేసి పనులు దక్కించుకున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.686.98 కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు ఆ విధానాలను రద్దు చేసి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారు.
ఇవీ అదనపు పనుల వివరాలు...
పోలవరం జాతీయ ప్రాజెక్టులో నాలుగు అదనపు పనులకు గత నెల 12వ తేదీన రూ.514.88 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
⇒ పోలవరం మండల కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే, కుడి కాలువను జలాశయంతో అనుసంధానం చేసే టన్నెళ్లు, శాడిల్ డ్యామ్స్ వద్దకు వెళ్లేలా రహదారి నిర్మాణం.
⇒ ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్–1 నుంచి ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్, కేఎల్ బండ్ మీదుగా ఎడమ కాలువ ప్రారంభ ప్రాంతం వరకు రోడ్డు నిర్మాణం.
⇒ తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం గ్రామానికి సమీపంలో గండిపోచమ్మ ఆలయం నుంచి అఖండ గోదావరి ఎడమ గట్టు(ఏజీఎల్బీ) రక్షణ పనులు చేపట్టడం.
⇒ స్పిల్ వే, కనెక్టివిటీస్కు కంట్రోల్ రూం, విద్యుత్ సబ్ స్టేషన్ అనుబంధ పనులు.


