ఒక్కొక్కటిగా అన్నీ నెరవేర్చుతాం: బాషా
సాక్షి, వైఎస్సార్ కడప: పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వలంటీర్ వ్యవస్థను నేడు ప్రారంభిస్తున్నామన్నారు. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో పాటు మూతపడ్డ చక్కెర పరిశ్రమను తెరిపించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని అభివృద్ధి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.