ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణకు పోలీసు విభాగం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగించుకోవాలని నిర్ణయించింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణకు పోలీసు విభాగం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగించుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమెరికాలో అమలులో ఉన్న విధానం, పనితీరుపై ఆ దేశానికి చెందిన సంస్థ గురువారం రాత్రి డీజీపీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. బాధితుల నుంచి కంట్రోల్రూమ్కు ఫోన్ వచ్చిన వెంటనే అది ఏ ప్రాంతం నుంచి వస్తోంది? అనేది సాంకేతికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికాలో ఈ విధానం అమలులో ఉండటంతో పోలీసులు స్పందించే సమయం (రెస్పాన్స్ టైమ్) కొన్ని నిమిషాల్లోనే ఉంటోంది. ఇదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో సైతం అమలు చేయాలని పోలీసు విభాగం నిర్ణయించింది. జీఐఎస్ (గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్), జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ద్వారా పని చేసే ఈ సాఫ్ట్వేర్ ప్రధాన కంట్రోల్ రూమ్లో ఉంటే.. బాధితులు సెల్ఫోన్ నుంచి కాల్ చేయగానే వారున్న ప్రాంతం అక్కడి తెరలపై కనబడుతుంది.
ఫలితంగా పోలీసులు తక్షణం స్పందించి బాధితుల సమీపంలో ఉన్న పోలీసు వాహనాలను అక్కడకు పంపడంతో పాటు మిగిలిన వారు వీలైనంత త్వరలో చేరుకునే అవకాశం ఉంది. ఈ విధానంపై ప్రజెంటేషన్ ఇచ్చిన అమెరికా సంస్థ ఆ వ్యవస్థ అమలు కావాలంటే పోలీసులకు టెక్నాలజీతో పాటు సిబ్బంది, వాహనాలు కూడా అవసరమని సూచించింది. బాధితుల వద్ద ఏ తరహా ఫోన్లు ఉండాలనే అంశంతో పాటు దీని అమలులో లోటు పాట్లను అధ్యయనం చేసిన తరవాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రికీ వివరించి ఆమోదముద్ర వేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.