జిల్లా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోని యువతీయువకులకు మళ్లీ అవకాశం లభించనుంది.
కలెక్టరేట్, న్యూస్లైన్ : జిల్లా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోని యువతీయువకులకు మళ్లీ అవకాశం లభించనుంది. నవంబర్ 10 నుంచి ఈనెల 23 వరకు జరిగిన ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కాని యువతీయువకులు ఆధైర్యపడాల్సిన అవసరం లేకుండా పొయింది. ప్రతీ ఏటా చేపట్టే సాధారణ నమోదు ప్రక్రియలో భాగంగా ఓటర్ల తుది జాబితా అనంతరం ఓటు నమోదు ప్రక్రియకు మళ్లీ శ్రీకారం చుట్టనున్నారు.
ఇందులో ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. కాగా, ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ లో డాటా ఎంట్రీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,16,276 దరఖాస్తులు అందాయి. ఇప్పటి వరకు 52,654 దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరిచారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రక్రియ కొనసాగుతుంది. ఆన్లైన్లో పొందుపర్చిన దరఖాస్తులను పరిశీలించిన ఓటర్ల తుది జాబితా తయారు చేస్తారు. అనంతరం 2014 జనవరి 16న జాబితాను విడుదల చేయనున్నారు. జనవరి 17 నుంచి సాధారణ ఎన్నికల నోటిషికేషన్ వచ్చే పది రోజుల ముందు వరకు కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో నమోదు చేసుకున్న వారికి వారం రోజుల్లో ఓటరు గుర్తింపు కార్డులు అందనున్నాయి. ఈ ప్రక్రియలో ఓటు నమోదు చేసుకున్న వారు 2014లో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి.