సమైకాంధ్ర కోసం ఈ నెల 12వ తేదీ నుంచి ఏపీఎన్జీవో సంఘాలు పిలుపు మేరకు విధులను బహిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సీమాంధ్ర జిల్లాల ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ తీర్మానించింది.
రాజమండ్రి రూరల్, న్యూస్లైన్ :సమైకాంధ్ర కోసం ఈ నెల 12వ తేదీ నుంచి ఏపీఎన్జీవో సంఘాలు పిలుపు మేరకు విధులను బహిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సీమాంధ్ర జిల్లాల ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ తీర్మానించింది. హుకుంపేటలోని రాజమండ్రి రూరల్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సీమాంధ్రలోని 13 జిల్లాల ఉపాధి హామీ పథక ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు, ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సమావేశంలో సీమాంధ్ర జిల్లాల జేఏసీ ఏర్పాటు చేశారు.
జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తూర్పుగోదావరి జిల్లా సంఘ అధ్యక్షుడు బి.నాగేశ్వరరావు సమైకాంధ్ర కోసం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. ఈ నెల 11వ తేదీన సీమాంధ్రలోని జిల్లా కేంద్రాల్లోని డ్వామా కార్యాలయాల వద్ద మహాధర్నా నిర్వహించి, పాదయాత్ర చేపడతారు.
12న 13 జిల్లాల్లోని మండల కేంద్రాల్లో ధర్నా, పాదయాత్ర ,13న అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ధర్నాలు, పాదయాత్ర, 14 నుంచి మండల కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని చెప్పారు. ఏపీఎన్జీవో జేఏసీ పిలుపునకు అనుగుణంగా తాము నడుచుకుంటామని తెలిపా రు. సమావేశంలో జి.ధర్మారావు(శ్రీకాకుళం), అశోక్, లక్ష్మణ్(విజయనగరం), రామస్వామి(విశాఖ), మహేష్ (పశ్చిమగోదావరి), జాన్బాబు (ప్రకాశం), సుబ్రహ్మణ్యం( నెల్లూరు), సత్యనారాయణ(గుంటూరు), జె.ప్రభాకరరెడ్డి (కడప), నాగేశ్వరరావు(చిత్తూరు), బాలకృష్ణ (అనంతపురం), సాయిబాబా(కర్నూలు) సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై రాస్తారోకో
హుకుంపేట వద్ద హైవేపై సమైకాంధ్రకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేశారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగువారి మనోభావాలు తెలుసుకోకుండా తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీర్మానం చేయడం దారుణమన్నారు.