డీఆర్‌ఎస్‌పై మరో వివాదం | Ind vs aus ball tracking hawkeye suffers inaccuracy in aaron finch review | Sakshi
Sakshi News home page

డీఆర్‌ఎస్‌పై మరో వివాదం

Mar 9 2019 1:22 PM | Updated on Mar 22 2024 11:31 AM

నెల రోజుల వ్యవధిలోనే డీఆర్‌ఎస్‌(అంపైర్‌ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి)లో మరో వివాదం చోటు చేసుకుంది. గత నెల 8వ తేదీన న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో డీఆర్‌ఎస్‌పై అనేక అనుమానాలు తలెత్తాయి.  కివీస్‌ ఆటగాడు డార్లీ మిచెల్‌ ఎల్బీగా మైదానం వీడిన తీరు అనేక ప్రశ్నలకు తావిచ్చింది. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో మిచెల్  ఎల్బీగా వెనుదిరిగిన తీరు అనేక సందేహాలకు చోటిచ్చింది.  

హాట్ స్పాట్‌లో మాత్రం బ్యాట్ తగిలినట్లు చూపించగా, స్నికో మీటర్‌లో దీనికి విరుద్ధంగా కనిపించింది. బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్‌ కనిపించలేదు. దాంతో బాల్‌ ట్రాకింగ్‌ ఆధారంగా థర్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు.  తాజాగా డీఆర్‌ఎస్‌లోని బాల్‌ ట్రాకింగ్‌ టెక్నాలజీ  అనేక ప‍్రశ్నలకు తావిచ్చింది. ఆసీస్‌తో రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో హాక్‌ఐ టెక్నాలజీ పని చేసే తీరు వివాదాస్పదంగా మారింది. కుల్దీప్‌ బౌలింగ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ ఎల్బీగా ఔటయ్యాడు. దానిపై డీఆర్‌ఎస్‌కు వెళ్లిన ఫించ్‌కు వ్యతిరేక నిర్ణయమే వచ్చింది. దాంతో 93 పరుగులు చేసిన ఫించ్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. థర్డ్‌ అంపైర్‌ పలు కోణాల్లో పరీక్షించి ఫించ్‌ను ఔట్‌గా ప్రకటించాడు. కాగా, కుల్దీప్‌ వేసిన ఆ బంతిని ట్రాక్‌ చేయడానికి ఉపయోగించిన హాక్‌ఐ టెక్నాలజీ చర‍్చనీయాంశమైంది.

ఆ బంతి పిచ్‌ అయ్యే క్రమంలో మిడిల్‌ స్టంప్‌ నుంచి మిడిల్‌ వికెట్‌ను గిరాటేస్తుండగా, బాల్‌ ట్రాకింగ్‌ టెక్నాలజీలో మాత్రం అది లెగ్‌ స్టంప్‌లో పడి మిడిల్‌ స్టంప్‌కు వెళుతున్నట్లు కనిపించింది. దాంతో డీఆర్‌ఎస్‌లో ఇంకా లోపాలు ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. గతంలో ఒకానొక సందర్భంలో డీఆర్‌ఎస్ సరిగా లేదనే వాదనను భారత్‌ బలంగా వినిపించింది. అయితే ఈ టెక్నాలజీని పలుమార్లు పరీక్షించిన తర్వాత అందుకు బీసీసీఐ ఓకే చెప్పింది. ఇప్పుడు డీఆర్‌ఎస్‌లో వరుస వైఫల్యాలు కొట్టిచ్చినట్లు కనబడుతుండటంతో అది ఏ జట్టును కొ్ంపముంచుతుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement