ఇసుక బుకింగ్ మాటున కొందరు సాగిస్తున్న ఆన్లైన్ మోసాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇసుక అక్రమార్కులపై కొరడా ఝుళిపించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోసపూరిత మార్గాలను అనుసరించిన వ్యక్తుల నుంచి ఇసుకను, వాహనాలను స్వాదీనం చేసుకుని వారిపై క్రిమినల్ కేసులు బనాయించింది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా పూర్తి పారదర్శకంగా ఇసుకను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం విదితమే. అయితే, కొందరు దళారులు అక్రమార్జనే లక్ష్యంగా వేర్వేరు వ్యక్తులు, చిరునామాలతో ఐడీలు సృష్టించి పెద్ద పరిమాణంలో ఇసుక బుక్ చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇసుక లోడుతో వెళ్లే వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించింది.