కృష్ణ నీళ్లు రాకపోతే సీమాంధ్ర ఎడారే: షర్మిల | Without Krishna water Seemandhra will change as Desert: Sharmila | Sakshi
Sakshi News home page

Sep 11 2013 8:59 PM | Updated on Mar 21 2024 8:47 PM

కృష్ణానది నీళ్లు రాకపోతే సీమాంధ్ర అంతా ఎడారిగా మారుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావం బస్సుయాత్రలో భాగంగా రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె గుంటూరు జిల్లా రేపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సముద్రం నీళ్లు మాత్రమే ఉన్నాయన్నారు. కృష్ణ నీళ్లు లేకుంటే పరిస్థితేంటని ఆమె కాంగ్రెస్ పార్టీని అడిగారు. ఇందుకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో మద్రాసు తీసుకున్నారు. ఇపుడు హైదరాబాద్ కూడా తీసుకుంటామంటున్నారన్నారు. చదువుకున్న విద్యార్ధులు ఇపుడు ఎక్కడికి వెళ్లాలి? అని ప్రశ్నించారు. అభివృద్ధి ఆగిపోతే ఉద్యోగులకు జీ తాలెలా ఇస్తారు? అని అడిగారు. సంక్షేమ పథకాలు ఎలా నడుపుకోవాలో దారి కూడా చూపరట అన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మౌనంగా ఉన్నారని విమర్శించారు. బ్లాంక్ చెక్ ఇచ్చినట్లుగా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిచ్చారన్నారు. చంద్రబాబు విభజనకు మద్దతు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఎందుకు ఇచ్చావని చంద్రబాబును ప్రజలు నిలదీయాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణ అనుకూల ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. చంద్రబాబు అవినీతి గురించి కథలుకథలుగా చెప్పుకోవచ్చన్నారు. ఆయన అవినీతిపై విచారణ జరిగితే ఎప్పుడో జైలులో ఉండేవారని చెప్పారు. చంద్రబాబు అవినీతిపై విచారణ చేయమంటే సిబ్బంది లేరంటూ సీబీఐ తప్పించుకుంటోందన్నారు. చిరంజీవి ఇంట్లో నోట్ల కట్టలు దొరికినా సీబీఐకి విచారణ చేయాలనిపించలేదని ఎద్దేవా చేశారు. సీబీఐ పంజరంలో చిలక, కాంగ్రెస్ పెరటిలో కుక్క అని విమర్శించారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితలకు ఒక న్యాయం, మోపిదేవి వెంకటరమణకు మరో న్యాయమా? అని షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మోపిదేవిని బలిపశును చేసిందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement