దర్యాప్తు పూర్తయిందన్న కేసులో మళ్లీ చార్జిషీటా? | | Sakshi
Sakshi News home page

Jul 4 2013 8:55 AM | Updated on Mar 20 2024 1:48 PM

దర్యాప్తు పూర్తైందని చెప్పిన కేసులో మళ్లీ ఛార్జ్‌షీట్‌ వేయడం సబబు కాదని... న్యాయస్థానాలను అది తప్పుదోవ పట్టించడమేనని... విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది సీబీఐ కోర్టు దృష్టి తెచ్చారు. చెల్లుబాటు కాని ఆ అనుబంధ ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించాలని కోర్టును కోరారు. కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడం చట్టపరంగా తప్పుకాదని సీబీఐ వాదించింది .క్విడ్‌ ప్రో కో కేసులో ఆడిటర్‌ విజయసాయిరెడ్డి పాత్రపై సీబీఐ మొదటి ఛార్జ్‌షీట్‌ ఏప్రిల్‌ 23, 2012న దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌కు సంబంధించిన దర్యాప్తు కూడా పూర్తైందని సీబీఐ కోర్టుకు స్వయంగా తెలిపింది. మరేమైందో ఏమో... 14 నెలల తర్వాత సీసీ నెంబర్‌ 9కు అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇది చెల్లుబాటు కాదని... విజయసాయి రెడ్డి వాదించారు. ఆ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోరాదని కోర్టును కోరారు. అనుబంధ ఛార్జ్‌షీట్‌లో కొత్త విషయాలేవి లేవని... ఓల్డ్‌ వైన్‌ ఇన్‌ న్యూ బాటిల్‌లాగా ఉందని విజయసాయి రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. రాజకీయంగా ఎదిరించిన వారిని అణచివేసేందుకు కాంగ్రెస్‌... సీబీఐని వాడుకుంటుందని..దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలందరూ సీబీఐ కేసుల్ని ఎదుర్కొంటున్న విషయాన్ని అంతా చూస్తున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు. అవినీతి నిరోధక చట్టం విజయసాయిరెడ్డికి వర్తించనప్పుడు... ఈ కేసును విచారించే అధికారం సీబీఐ కోర్టుకు ఉండదని గుర్తు చేశారు. అందుకే విజయసాయిరెడ్డికి పీసీ యాక్టు సెక్షన్‌ 13 ఆపాదించేందుకు సీబీఐ అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిందని కోర్టుకు తెలిపారు. సీబీఐ మాత్రం తన వాదనను సమర్థించుకుంది. అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడం కొత్తేమి కాదని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును ఈ నెల 26కు వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement