బ్యాంకుల్లో ఉచిత నగదు లావాదేవీల సంఖ్యను కుదిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలు బుధవారం నుంచి పరిమితులను అమల్లోకి తెచ్చాయి. నెలలో నాలుగు నగదు లావాదేవీలు (డిపాజిట్లు, విత్డ్రాయల్స్) దాటితే రూ. 150 వడ్డించడం మొదలుపెట్టాయి. పొదుపు, శాలరీ అకౌంట్లకు వీటిని వర్తింపచేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక సర్క్యులర్లో తెలిపింది. దీని ప్రకారం ఒక నెలలో పొదుపు ఖాతాలకు సంబంధించి హోమ్ బ్రాంచ్లలో నాలుగు నగదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు. అవి దాటితే ప్రతి అదనపు లావాదేవీపై రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. ఇక థర్డ్ పార్టీ నగదు లావాదేవీలకు సంబంధించి రోజుకు రూ. 25,000 పరిమితి ఉంటుంది. బేసిక్ నో–ఫ్రిల్స్ ఖాతాల్లో గరిష్టంగా నాలుగు విత్డ్రాయల్స్ ఉచితంగా ఉంటాయి. నగదు డిపాజిట్లకు ఫీజులేమీ వర్తించవు.