పదవుల కోసమే దాడి వీరభద్రరావు పిచ్చివాగుడు వాగుతున్నారని వైఎస్ఆర్ సిపి మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు విమర్శించారు. పలువరు పార్టీ నేతలతో కలిసి ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిస్తేనే దాడి అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. పార్టీలోకి రమ్మని దాడిని ఎవరూ ఆహ్వానించలేదని చెప్పారు. దాడి ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు. పదవుల కోసమే దాడి ఈ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ నుంచి వెళ్లిపోదలచుకుంటే వెళ్లిపోవాలని, ఇటువంటి మాటలు మాట్లాడటం మంచిదికాదని అన్నారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇతర నాయకులు మాట్లాడుతూ జగన్ ఓ శక్తి అని, ఆ శక్తిని అడ్డుకునే దైర్యం ఎవరికీ లేదన్నారు. పార్టీ మారాలన్న ఉద్దేశం, అధికార దాహంతో దాడి అలా మాట్లాడుతున్నారన్నారు. టిడిపిలో పదవులు అనుభవించిన దాడి, అధికారంలో ఉండే పార్టీలోకి వెళ్లడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించి పార్టీలో చేరారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో మళ్లీ పార్టీ మారడానికే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఊసరవెల్లిలా పార్టీలు మారే దాడి నైజం మరోసారి బయటపడిందన్నారు. దాడి కోవర్టుగా వచ్చినట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. టిడిపిలో ఉన్నప్పుడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించారు. ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ సిపిలో చేరే సమయంలో చంద్రబాబు నాయుడుని విమర్శించారు. ఇప్పుడు జగన్ను విమర్శిస్తున్నారు. ఆయన నైజం అదేనన్నారు. ప్రజలు అర్ధం చేసుకుంటారని చెప్పారు. ఆయన ఎక్కువగా మాట్లాడితే తమ పార్టీ కార్యకర్తలు తిప్పికొడతానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పార్టీలో విలీనం కావలసిన పరిస్థితి లేదన్నారు. జగన్పై అభిమానంతో తమ పార్టీకి జనం బాగానే ఓట్లు వేసినట్లు చెప్పారు. కొద్ది శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయినట్లు తెలిపారు. 2019 ఎన్నికల నాటికి తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Jun 11 2014 9:00 PM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
Advertisement
