ఒక్క రోజుకే ‘షెడ్డు’కు..! | CM kcr bullet proof bus to go shed with in one day | Sakshi
Sakshi News home page

Jul 5 2015 6:37 AM | Updated on Mar 21 2024 7:54 PM

ఎన్నో హంగులు.. ప్రత్యేకతలతో మెర్సిడెస్ బెంజ్ రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఒక్క రోజుకే ‘షెడ్డు’కు చేరింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేసిన ఈ బస్సులోని ఏర్పాట్లపై సీఎం పెదవి విరిచారు. దీంతో వాటిని సరిదిద్దేందుకు ఆర్టీసీ అధికారులు వెంటనే బస్సును.. దాని బాడీ రూపొందించిన జేసీబీఎల్ కంపెనీకి అప్పగించారు. ఫలితంగా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బస్సులో కాక తన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్లారు. శుక్రవారం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కేసీఆర్ ఈ బస్సులోనే వెళ్లారు. ఆరోజు ఉదయం యాదాద్రి ఆలయం వద్ద బస్సుకు పూజలు చేయించి తీసుకొచ్చాక ముఖ్యమంత్రి పర్యటన మొదలైంది. ఆ సందర్భంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సీడీని ప్లే చేయగా పాట రాలేదు. అర కిలోమీటర్ దూరం వరకు వినిపించే శక్తివంతమైన సౌండ్ సిస్టం ఏర్పాటు చేసిన బస్సులో సాధారణ సీడీ ప్లే కాకపోవటంతో ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తెలుపు రంగులో ఉన్న బస్సు బాడీపై ఆకుపచ్చ రంగు స్ట్రైప్ ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement