● 26న బద్వేలు నియోజకవర్గంలో
పర్యటిస్తా
● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్రోడ్స్ : ప్రజలు సమర్పించే అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అఽధికారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఒకనెల, ఒక నియోజకవర్గం, నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా ఈనెల 26వ తేది బద్వేలు నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. ఆ నియోజకవర్గంలో గతంలో జరిగిన మూడు పర్యటనల్లో అందిన అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలను సవివరంగా తెలియజేసేందుకు అధికారులు సన్నద్దంగా ఉండాలన్నారు. జులైలో రాజంపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పీజీఆర్ఎస్లో రీ ఓపెన్ అయిన అర్జీలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీసు వినియోగం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అయినా కొన్ని శాఖల్లో భౌతిక ఫైల్స్ ఎందుకు నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ నిధి మీనా, డీఆర్వో మల్లికార్జునుడు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


