కడప సెవెన్రోడ్స్ : రైతులకు నకిలీ మొక్కజొన్న విత్తనాలు సరఫరా చేసిన అడ్మాంట కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏపీ రైతు సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షులు ఎంవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వీఎన్ పల్లె మండలంలోని సంగాలపల్లె, గంగిరెడ్డిపల్లె, మిట్టపల్లె, పాయసంపల్లె తదితర గ్రామాలకు చెందిన రైతులు సుమారు 400 ఎకరాల్లో అడ్మాంట కంపెనీ విత్తనాలు సాగు చేసి దిగుబడి రాక పూర్తిగా నష్టపోయారని పేర్కొన్నారు. కంపెనీ ప్రతినిధులు మునిరామశేఖర్రెడ్డి, రాంకుమార్రెడ్డి, జీవన్; రమణారెడ్డిలు విత్తనాలు మంచి దిగుబడి వస్తాయని నమ్మించి రైతులకు అంటగట్టారన్నారు. ఇప్పుడు చూస్తే దిగుబడి రాక రైతులు నష్టపోయారని తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి.మల్లికార్జునరెడ్డి, బాలచంద్రయ్య, టి.రామ్మోహన్రెడ్డి, కట్టా యానాదయ్య, చంద్రమోహన్రెడ్డి, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.


