కడప రూరల్ : కష్టాలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాం, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించి, ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించాలని బ్రహ్మంగారిమఠం మండలం కమ్మవారిపల్లెకు చెందిన దంపతులు మంజుల, వెంకటసుబ్బయ్య కోరారు. సోమవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మంజుల మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం తాము ప్రేమించుకున్నామని, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో వెంకటసుబ్బయ్య ప్రమాదానికి గురై రెండు కాళ్లు కోల్పోయారని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యుల వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకున్నానని చెప్పారు. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ తమ వివాహం జరిగినప్పటి నుంచి తన భార్య మంజుల కుటుంబ సభ్యులు, తమ వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మధ్యవర్తులపై కూడా తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. కాగా కొంతకాలం ఇతర రాష్ట్రంలో నివసించాల్సి వచ్చిందన్నారు.
ప్రస్తుతం తమకు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడని, గ్రామంలో పెద్దలను చూసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించి ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించాలని కోరారు.
ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల వేడుకోలు


