కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్–5 మ్యాచ్లు విజయవంతమైనట్లు ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ భరత్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఎల్ మ్యాచ్లు కడపలో నిర్వహించేందుకు సహకరించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నాయకులు కేశినేని చిన్ని, సానా సతీష్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కడప ప్రజలు వేలాదిగా తరలివచ్చి మ్యాచ్లను వీక్షించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలికి తీసేందుకు ఇటువంటి మ్యాచ్లు దోహదపడతాయన్నారు. వైఎస్ రాజారెడ్డి స్టేడియాన్ని ధర్మశాల స్టేడియంతో పోల్చడం గర్వంగా ఉందన్నారు. ఈ మ్యాచ్లో పాల్గొన్న ఏడు టీముల క్రీడాకారులు స్టేడియాన్ని చూసి అద్భుతంగా ఉందని కొనియాడారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద మ్యాచ్లను నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నాయకులు సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. మరో ఐదు వేల మంది మ్యాచ్లను వీక్షించేందుకు అదనంగా స్టేడియం సామర్థ్యాన్ని పెంచేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్, అద్యక్షులు మునికుమార్రెడ్డి, అసోసియేషన్ మెంబర్ నగేష్ పాల్గొన్నారు.
ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్
కమిటీ మెంబర్ భరత్రెడ్డి


