కడప వైఎస్సార్ సర్కిల్ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో భాగంగా విజయవాడ సన్షైనర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా రికార్డుల చరిత్రను తిరగరాశారు. ఓపెనర్లు మున్నంగి అభినవ్ (137 నాటౌట్), కెప్టెన్ అశ్విన్ హెబ్బార్ (130) విధ్వంసకర శతకాలతో కాకినాడ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరి వీరవిహారంతో ఏపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ నష్టానికి ఏకంగా 290 పరుగుల కొండంత స్కోరు నమోదైంది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కాకినాడ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో విజయవాడ సన్షైనర్స్ 110 పరుగుల భారీ తేడాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఓపెనర్ల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం
కాకినాడ కింగ్స్ కెప్టెన్ మనీష్ గొలమారు టాస్ గెలిచి విజయవాడ సన్షైనర్స్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. కానీ, ఆ నిర్ణయం కాకినాడకు భారీ నష్టాన్ని మిగిల్చింది. తొలుత బ్యాటింగ్కు దిగిన విజయవాడ ఓపెనర్లు మొదటి ఓవర్ నుంచే కాకినాడ బౌలర్లకు నరకం చూపించారు. మున్నంగి అభినవ్ కేవలం 69 బంతుల్లో 9 ఫోర్లు, 10 గగనతల సిక్సర్లతో 137 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు కెప్టెన్ అశ్విన్ హెబ్బార్ కేవలం 53 బంతుల్లోనే 13 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 130 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరూ మొదటి వికెట్కు ఏకంగా 260 కి పైగా పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖర్లో షేక్ జహీర్ అబ్బాస్ కేవలం 2 బంతుల్లో 2 సిక్సర్లతో 12 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మున్నంగి అభినవ్ ఎంపకయ్యాడు.
బౌలింగ్లోనూ సన్షైనర్స్ మెరుపులు
291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కాకినాడ కింగ్స్ జట్టుకు మొదటి ఓవర్లోనే విజయవాడ బౌలర్లు షాక్ ఇచ్చారు. కెప్టెన్ మనీష్ గొలమారు (0) ఖాతా తెరవకుండానే అవుట్ కాగా, అర్జున్ టెండూల్కర్ (17), అభిషేక్ రెడ్డి (9)లు త్వరగానే పెవిలియన్ చేరారు. మిడిలార్డర్లో పిన్నింటి తపస్వి (27), ఒమ్మి భాస్వంత్ కృష్ణ (30), మిట్టా లేఖాజ్ రెడ్డి (31), హరిశంకర్ రెడ్డి (20)లు పోరాడినప్పటికీ రన్ రేట్ ఒత్తిడి కారణంగా వికెట్లు సమర్పించుకున్నారు. విజయవాడ బౌలర్లలో బి.ప్రణవ్ రెడ్డి 3 వికెట్లు (3/30) తీసి కాకినాడ వెన్ను విరవగా, తన్నీరు భరత్ 2 వికెట్లు, సాయి వెంకట సుమిత్, సిద్ధార్థ, లలిత్ మోహన్ తలా ఒక వికెట్ పడగొట్టి విజయవాడకు భారీ విజయాన్ని అందించారు.


