‘అల్లారుముద్దుగా సాదుకున్న ఇద్దరు బిడ్డలు పోయాక మాకు దిక్కెవరు? మేము ఎవరి కోసం బతకాలి?‘ అంటూ సంఘటనా స్థలంలో కన్నతండ్రి కారపురెడ్డి లోకేశ్వరరెడ్డి రోదన చూసి అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది. ఆయనను ఆపడం ఎవరి తరమూ కాలేదు. ‘నాన్నా.. మేము కాలేజీలకు వెళ్లేముందు అమ్మమ్మగారింటికి వెళ్లొస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి.. మాకు ఇంతదూరంగా వెళ్లిపోయారా?‘ అంటూ భోరున విలపించాడు. ‘పెద్ద కొడుకు జయంత్ను బీటెక్లో చేర్పించా, చిన్న కొడుకు రాజ్వర్ధన్ను ఇంటర్లో చేర్పించానని బంధుమిత్రులందరికీ ఎంతో ఆనందంతో చెప్పానే.. ఆ ఆనందం కొద్దిరోజులు కూడా నిలబడలేదే! వ్యాపారం చేసుకుంటూ బిడ్డలిద్దరినీ ప్రయోజకులను చేయాలని, ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదని మంచి కాలేజీల్లో చేర్పించేందుకు నేను పడ్డ తపన అంతా పాపాఘ్ని మింగేసింది‘ అంటూ ఆయన కన్నీరుమున్నీరైన తీరు చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.


