● ఎన్టీఏ మార్గదర్శకాలు పాటించాలి
● జిల్లాలో నీట్ (యూజీ)–2026
పరీక్షకు 10 కేంద్రాలు
● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్రోడ్స్ : నీట్ (యూజీ)–2026 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎన్టీఏ నిబంధనలను కచ్చి తంగా పాటిస్తూ పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకుని ప్రశాంతంగా పరీక్ష రాయాలని కలెక్టర్ శ్రీధర్ సూచించారు. ఆదివారం జరగనున్న ‘నీట్‘ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై శనివారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్తో జరిగిన వీసీలో కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్ష సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు విద్యార్థులు ఎన్టీఏ జారీ చేసిన నిబంధనలు, సూచనలు పాటించాలని కోరారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతా తనిఖీలు, బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియలకు సమయం పట్టే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఆలస్యం చేయకుండా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాన్ని విడిచి వెళ్లేందుకు అనుమతి ఉండదని తెలిపారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డులో పేర్కొన్న సూచనలను చదివి వాటిని అనుసరించాలని సూచించారు. ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం 3,148 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో కడప పట్టణ పరిధిలో 8 కేంద్రాల్లో 2,386 మంది, ప్రొద్దుటూరు పరిధిలోని 2 కేంద్రాల్లో.. 762 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.
నీట్ పరీక్ష కేంద్రాల పరిశీలన
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లోని పలు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను శనివారం సాయంత్రం కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ప్రొద్దుటూరులోని వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల, అనిబిసెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలు, కడపలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పురుషుల కళాశాలలను కలెక్టర్ పరిశీలించారు.


