స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం
కడప అర్బన్: మహిళా భద్రత కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఈవ్ టీజింగ్, మహిళలు, చిన్నారులపై నేరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం లోని కాన్ఫరెనన్స్ హాలులో ప్రొద్దుటూరు సబ్ డివిజన్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా, స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఇప్పటినుండే తగిన ప్రణాళికలు రూపొందించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉక్కుపాదం మోపాలన్నారు.రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత గడువులోగా, చట్ట పరిధిలో పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్)కె.ప్రకాష్ బాబు, ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ , ప్రొద్దుటూరు సబ్ డివిజన్ లోని సీఐ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్


