తల్లికి వందనం పెద్ద స్కామ్‌ | - | Sakshi
Sakshi News home page

తల్లికి వందనం పెద్ద స్కామ్‌

Jun 19 2025 4:18 AM | Updated on Jun 19 2025 4:18 AM

తల్లికి వందనం పెద్ద స్కామ్‌

తల్లికి వందనం పెద్ద స్కామ్‌

కడప సెవెన్‌రోడ్స్‌: రాష్ట్ర ప్రభుత్వం అనేక షరతులతో అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం వెనుక పెద్ద స్కామ్‌ నడుస్తోందని మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా ఆరోపించారు. బుధవారం తన కార్యాలయంలో ‘జగన్‌ అంటే నమ్మకం–చంద్రబాబు అంటేమోసం’అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక్క ఆధార్‌ నంబరుతో వందల మంది టీడీ పీ కార్యకర్తలకు తల్లికి వందనం డబ్బులు దోచి పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి రూ. 15 వేలు చొప్పున సాయం అందిస్తామంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉండగా, అనేక షరతులు విధించి 31 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వకుండా కోత విధించారని పేర్కొన్నారు. ఈ పథకం కింద రూ.13 వేలు మాత్రమే అందజేస్తున్నారని, మిగతా మొత్తం మంత్రి నారా లోకేష్‌ జేబుల్లోకి వెళుతోందని తెలిపారు.

బాబు హామీల అమలు గాలికి

కడపలో టీడీపీ నేతలు ఏ ఒక్క వ్యాపారిని, డాక్టర్లను వదలకుండా మామూళ్ల దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అంటూ 143 అలవిగాని హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. వలంటీర్లకు పది వేల రూపాయల వేతనం ఇస్తామని నమ్మబలికి ఆ వ్యవస్థనే రద్దు చేశారన్నారు. నిరుద్యోగులకు రూ. 3 వేలు భృతి ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ. 1500 చొప్పున సంవత్సరానికి రూ. 18 వేలు రావాల్సి ఉండగా, ఒక్క రూపాయి విదిల్చిన పాపాన పోలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పటివరకు కల్పించలేదన్నారు. మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్క సిలిండర్‌ మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అటకెక్కిందన్నారు. అమరావతి పేరుతో దోచుకుంటున్నారని చెప్పారు. విద్యుత్‌ చార్జీల పేరుతో ప్రజలపై రూ. 15 వేల కోట్ల భారం మోపారన్నారు. ప్రతి ఏడాది ఇంటి పన్ను పెంచుతూనే ఉన్నారని తెలిపారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు మొబలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇస్తున్నారని తెలిపారు. ఏడాది కాలంలో 188 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారని, సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలోనే మహిళలపై దాష్టీకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇంత జరుగుతున్నా హోం మంత్రి అనిత, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 3,33,000 కోట్ల రూపాయలు అప్పు చేసి సంక్షేమానికి ఖర్చు చేయగా, బాబు ఏడాది పాలనలోనే లక్షా 60 వేల కోట్లు అప్పు చేసి ఏ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించలేదని విమర్శించారు.

● ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, నాయకులు పులి సునీల్‌కుమార్‌, షఫీ, యానాదయ్య, పాకా సురేష్‌, బసవరాజు,దాసరి శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

బాబు హయాంలో విద్యారంగం కుదేలు: రామచంద్రారెడ్డి

ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 26 మెడికల్‌ కళాశాలలు తీసుకొచ్చారని తెలిపారు. పులివెందుల మెడికల్‌ కళాశాల పనులు 90 శాతం పూర్తి చేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి వల్ల విద్యార్థులు సీట్లు కోల్పొయిన పరిస్థితి ఏర్పడటం విచారకరమన్నారు. తల్లికి వందనం పథకాన్ని అనేక షరతులు విధించారన్నారు. కర్నూలు జిల్లాలో ఒక్క ఆధార్‌ నంబరుతో 340 మందికి తల్లికి వందనం డబ్బులు ఇచ్చారంటే ఈ పథకం ఎంత అస్తవ్యస్తంగా కొనసాగుతుందో తెలుస్తోందన్నారు. బాబు హయాంలో విద్య, వైద్య రంగలు కుదేలయ్యాయన్నారు. ఉద్యోగులకు ఇంతవరకు పీఆర్సీ లేకపోగా ఇవ్వాల్సిన నాలుగు డీఏలను పెండింగ్‌లో ఉంచడం బాధాకరమన్నారు.

టీడీపీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారు

అధికారంలోకి రాగానే విచారణ

కడపలో టీడీపీ నేతలమామూళ్ల దందా

మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement