
పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఎస్.రమణ
ప్రొద్దుటూరు: ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఎస్.రమణ తెలిపారు. స్థానిక పవర్ హౌస్ రోడ్డులోని విద్యుత్ డివిజన్ కార్యాలయ ఆవరణలో బుధవారం ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ రమణ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రభుత్వం ఒక కిలోవాట్కు రూ.30వేలు, 2 కిలోవాట్లకు రూ.60వేలు, 3 కిలో వాట్లకు రూ.78వేలు రాయితీ ఇస్తుందన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు పూర్తయిన తర్వాత సబ్సిడీ మొత్తం మీ బ్యాంకు ఖాతాకు 30 రోజుల్లో జమ అవుతుందన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు అయ్యే మొత్తం వ్యయంపై 90 శాతం బ్యాంకులు ఎటువంటి పూచీకత్తు లేకుండా సిబిల్ రేటింగ్ బట్టి ఎటువంటి ప్రయాసలు లేకుండా ఒకే రోజు రుణం మంజూరు చేస్తారన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు 6.75 శాతం సబ్సిడీ వడ్డీ రేటుతో రుణాలు అందిస్తాయని, ఈ రుణం కేవలం ఐదేళ్లలో తీరిపోతుందని తెలిపారు. సోలార్ విద్యుత్ను మీరు వాడుకోగా మిగిలిన విద్యుత్కు యూనిట్ రూ.2.09 వంతున సంస్థ డబ్బులు చెల్లిస్తుందన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకున్న సీవీ కొండప్ప, షఫివుల్లా మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుపై ఎలాంటి సమస్యలు లేవన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు తిరిష, వెంకటకృష్ణయ్య, హర్షవర్ధన్, ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ రమణారెడ్డి, డీఈఈలు శ్రీనివాసులరెడ్డి, శిరీష తదితరులు పాల్గొన్నారు.