
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
జమ్మలమడుగు: యోగాతోనే సర్వమానవాళికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని , దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరకూరి పేర్కొన్నారు. బుధవారం యోగాంధ్ర మహోత్సవంలో భాగంగా మండలపరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో యోగా కార్యక్రమాన్ని ఐదువేల మందితో నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి ఎందరో మునులు, రుషులు యోగులు తపోనిష్ట సమయంలో అనారోగ్యాలు దరి చేరకుండా యోగాసనాలు, ప్రాణాయామలు చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని తమ సొంతం చేసుకున్నారని గుర్తు చేశా రు. చదువులు, ఇంట్లో పనులు ఆఫీసుల్లో ఒత్తిళ్ల కారణంగా ఎంతో మంది శారీరక, మానసిక ఆరోగ్య రుగ్మతలను ఎదుర్కొంటున్నారు. వీటన్నింటిన్ని జయించి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే సులభతరమైన ఆరోగ్య సూత్రం యోగా మాత్రమే అని అన్నారు. ఈనెల 21న రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెన్–2025 నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాను ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం డ్రగ్స్ నిర్మూళనపై ఈగల్ టీం ద్వార రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పోస్టర్లను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జి భూపేష్రెడ్డి, ఆర్డీఓ సాయిశ్రీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈసీ సభ్యుడు వరుణ్కుమార్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరకూరి

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం