
జామ్ కౌన్సెలింగ్
కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను జూమ్ కౌన్సెలింగ్ ద్వారా చేపడుతున్నారు. ఈ విధానం జామ్ కౌన్సెలింగ్ గా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీల ప్రక్రియ బుధవారం నాటికి రెండోరోజుకు చేరింది. ఈ శాఖ పరిధిలో రాయలసీమ జిల్లాల్లోని వైద్య ఆరోగ్యశాఖ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నిబంధనల ప్రకారం బదిలీలను చేపడుతున్నారు. ఆ ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ కేడర్లకు చెందిన ఉద్యోగులు జూమ్ కౌన్సెలింగ్లో పాల్గొనడానికి వైఎస్సార్ జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో వచ్చారు.ఇక్కడ ఉద్యోగుల సౌకర్యార్థం ఒక సిస్టం ను కేటాయించారు. స్టాఫ్ నర్స్, ఎంపీ హెచ్ఎస్, ఎంపీహెచ్ ఈఓ, హెచ్ఈఓ, డీపీఎమ్ఓ, పీహెచ్ఎన్ (టీ), సీనియర్ అసిస్టెంట్స్ తదితర కేడర్లకు చెందిన ఉద్యోగులు కౌన్సెలింగ్ లో పాల్గొనాలి. కాగా ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఇతర సాంకేతిక కారణాలు తోడు కావడంతో సాయంత్రం అయినప్పటికీ అధిక సంఖ్యలో ఉద్యోగులు కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు ప్రధానంగా మహిళా ఉద్యోగులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఉద్యోగుల సౌకర్యార్థం చేపడుతున్న జూమ్ కౌన్సిలింగ్ నత్త నడకన సాగుతూ జామ్ కౌన్సెలింగ్ గా మారిందని ఉద్యోగులు ఆరోపించారు.
బదిలీల ప్రక్రియలో ఇబ్బందులు
జూమ్ కాస్త జామ్ కౌన్సెలింగ్గామారిన వైనం