
రేపు బదిలీ కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో మినిమం టైమ్ స్కేల్పై పనిచేస్తున్న డీఎస్సీ 2008, 1998 సెకండరీ గ్రేడ్ టీచర్స్కు 20వ తేదీ బదిలీ కౌన్సెలింగ్ను నిర్వహిస్తున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. కడప డీఈఓ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఉపాధ్యాయుల జాబితా జిల్లా విద్యాశాఖాధికారి అంతర్జాలం www.kadapa deo.in లో ఉంచినట్లు తెలిపారు.
నేడు ‘పాత్రికేయులకు యోగా శిక్షణ‘
కడప సెవెన్రోడ్స్: కడపలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఈ నెల 19వ తేదీన ప్రత్యేకించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు,వారి కుటుంబ సభ్యులకు యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు సంబంధించిన జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
హుండీల ఆదాయం లెక్కింపు
చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆలయంలోని ఏడు శాశ్వత హుండీల ద్వారా రు.20,81,450లు ఆదాయం వచ్చిందని తెలిపారు. అలాగే మిక్స్డ్ బంగారు వస్తువులు 000.005.000 గ్రాములు, వెండి వస్తువులు 000.320.000 గ్రాములు వచ్చాయ న్నారు. అన్న ప్రసాద వితరణ సత్రంలోని హుండీ ద్వారా మరో రూ.29,163,00లు వచ్చినట్లు తెలిపారు. కడప దేవదాయశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ రమణమ్మ, ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ సంఘాల నియామకం
కడప సెవెన్రోడ్స్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ సంఘాల కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల నుంచి పలువురికి అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గాల్లో చోటు లభించింది. బద్వేలుకు చెందిన జగన్నాథం నాగేంద్రను రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా, జమ్మలమడుగుకు చెందిన ఎం.రామకృష్ణ నాయక్ను ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా, పులివెందులకు చెందిన ఎస్.మహేశ్వరిని ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శిగా, బద్వేలుకు చెందిన కుప్పల వెంకట రమణను కల్చరల్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, జమ్మలమడుగుకు చెందిన భూమిరెడ్డి దివాకర్రెడ్డిని కల్చరల్ విభాగ సంయుక్త కార్యదర్శిగా నియమించారు.
● అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గానికి చెందిన గడికోట వెంకట సుబ్బారెడ్డిని రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శిగా, రాజంపేటకు చెందిన నాగేంద్ర నాయక్ను ఎస్టీ సెల్ కార్యదర్శిగా, పీలేరుకు చెందిన జి.అమర్నాథరెడ్డిని ప్రచార విభాగ ప్రధాన కార్యదర్శిగా, మదనపల్లెకు చెందిన కె.రత్నప్పను సాంస్కృతిక విభాగ సంయుక్త కార్యదర్శిగా, రాజంపేటకు చెందిన మోడెం నాగభూషణంను చేనేత విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
కలెక్టర్ చొరవతో
సమస్య పరిష్కారం
కడప సెవెన్రోడ్స్/జమ్మలమడుగు: జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలోని ఇండియన్ సిమెంట్స్ లిమిటెడ్ (ఐసీఎల్) ప్లాంట్లో కార్మికులు, సంస్థ నిర్వహణ మధ్య ఇటీవల ఏర్పడిన సమస్య కలెక్టర్ డాక్టర్ శ్రీధర్చెరుకూరి చొరవతో పరిష్కారమైంది. ఎర్రగుంట్లలోని ఐసీఎల్లో రెండు ప్లాంట్ల మధ్య యాజమాన్యానికి, కార్మికులకు ఉన్న సమస్యల పరిష్కారానికి బుధవారం కలెక్టర్ ఇరువర్గాలతో చర్చలు నిర్వహించారు. ఈ చర్చల్లో ఉభయపక్షాలు కలసికట్టుగా పాల్గొని, పరస్పర అంగీకారంతో అన్ని సమస్యలను సఖ్యత పూర్వకంగా పరిష్కరించుకున్నాయి. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పరిణామంతో ప్లాంట్లో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యాయన్నారు. సంస్థ కార్యకలాపాలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయని తెలిపారు.

రేపు బదిలీ కౌన్సెలింగ్