
డీఎస్సీ పరీక్షకు 267 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డీఎస్సీ ఆన్లైన్ పరీక్షకు మంగళవారం 267 మంది గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్లో 9 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 1,514 మంది అభ్యర్థులకు గాను 1,307 మంది హాజరు కాగా 207 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం విడతలో 3 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 545 మందికి గాను 485 మంది హాజరు కాగా 60 మంది గైర్హాజయ్యారు. మొత్తం 2,059 మందికి గాను 1,792 మంది హాజరు కాగా 267 మంది గైర్హాజరయ్యారు.
20న జాబ్ మేళా
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 20న కడప నగరంలోని ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ మైనారిటీస్ జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు తమ 10వ తరగతి మార్కుల జాబితా, ఐటీఐ మార్కుల జాబితా, ఐటీఐ ఎన్టీసీ సర్టిఫికెట్, ఆధార్కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పాస్పోర్టు సైజు ఫొటోతోపాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకుని హాజరు కావాలని పేర్కొన్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొని వారికి కావాల్సిన ట్రేడ్ విద్యార్థులను ఎంపిక చేసుకుంటారన్నారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జీతం ఉంటుందని తెలిపారు. పీఎఫ్, మెడికల్ అలవెన్స్తోపాటు క్యాంటీన్ సౌకర్యం కల్పిస్తారని వివరించారు.
సర్వసభ్య సమావేశానికి పటిష్ట భద్రత కల్పించండి
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థలో ఈ నెల 20వ తేదీన నిర్వహించే సర్వసభ్య సమావేశానికి పటిష్ట భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు డైరెక్షన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్వసభ్య సమావేశంలో తమకు రక్షణ కల్పించాలని, తమ హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని 39 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు హైకోర్టులో ఇటీవల పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మంగవారం విచారణ జరిపిన న్యాయస్థానం సీరియస్గా స్పందించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పోలీసులు సక్రమంగా పాటించలేదని, గత సమావేశాల్లో జరిగిన పొరపాట్లు ఈ సమావేశంలో జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: వైఎస్ఆర్ కడప జిల్లా అడ్మిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సమగ్రశిక్ష కార్యాలయంలో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులుగా పని చేయుటకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు(స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రెడ్ టీచర్స్) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నిత్యానందరాజులు తెలిపారు. ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్, అసిస్టెంట్ కమ్యూనిటీ మొబలైజేషన్ అఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 21 నుంచి 30 వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులు ఎన్జీవో కాలనీలోని అడిషినల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సమగ్రశిక్ష కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పని వేళల్లో కడపలోని అడిషినల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సమగ్ర శిక్ష కార్యాలయం వారిని సంప్రదించాలని వివరించారు.
ట్రాన్స్కో ఎస్ఈ
బాధ్యతల స్వీకరణ
కడప కార్పొరేషన్: ఏపీ ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఇంజినీర్గా సి.శ్రీరామ చంద్రమూర్తి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 132కేవీ, 220 కేవీ సబ్స్టేషన్లను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. కార్మికులు, ఇంజినీర్లు సమన్వయంతో పని చేసి సంస్థకు మంచిపేరు తేవాలని కోరారు. అనంతరం విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీకే వీరభద్రయ్య, ఇతర అధికారులు, ఉద్యోగులు ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈలు శ్రీనివాసరావు, విశ్వేశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, ఈఈలు సుబ్రమణ్యం, నగేష్, రామిరెడ్డి, వెంకటేశ్వర్లు, నరేంద్ర, నారాయణస్వామి, చంద్రశేఖర్, సతీష్, గోపాలుడు, డీఈలు వెంకటసుబ్బయ్య, రామ్మోహన్, అచ్యుత్రెడ్డి, విష్ణుకుమార్, రెడ్డి శేఖర్ రమణ తదితరులు పాల్గొన్నారు.