సమస్యల వలయంలో కడప ‘రిమ్స్‌’ | - | Sakshi
Sakshi News home page

సమస్యల వలయంలో కడప ‘రిమ్స్‌’

Jun 18 2025 3:49 AM | Updated on Jun 18 2025 3:49 AM

సమస్య

సమస్యల వలయంలో కడప ‘రిమ్స్‌’

కడప అర్బన్‌ : కడప రిమ్స్‌ సమస్యల వలయంలో చిక్కుకుంది. ఓపీ, ఐపీ విభాగాలలో రోగులు పలురకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వైద్యులు ఆయా విభాగాలలో చిత్తశుద్ధితో విధులను నిర్వహిస్తూ వుంటే, కొన్ని విభాగాలలో మాత్రం కేవలం ఎఫ్‌ఆర్‌ఎస్‌, అటెండెన్స్‌ రిజిష్టర్‌లలో సంతకాలను పెట్టి మరీ తమ సొంత క్లినిక్‌లను పయనమవుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని ఓపీ విభాగాలలో హౌస్‌ సర్జన్‌లు, పీజీ విద్యార్థులచే వైద్య పరీక్షలను చేయించి పంపించేస్తున్నారు.

ఎక్స్‌రేలు, ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్‌ రిపోర్ట్‌లను ఎప్పటికపుడు ఇస్తే ఆయా డాక్టర్‌లను సంప్రదించి తగిన వైద్య సేవలను పొందే అవకాశాలున్నాయి. ఫిల్మ్‌ల కొరతతో ఆయా విభాగాల డాక్టర్‌లకు ఎక్స్‌రే రిపోర్ట్‌లను వారి సెల్‌ఫోన్‌లకు ఆన్‌లైన్‌ ద్వారా పంపించేస్తున్నామంటూ రోగులకు తెలియజేస్తున్నారు. మరి డాక్టర్‌ అందుబాటులో వుంటే సరైన వైద్య సహాయంను అందించే అవకాశం వుంటుంది. కానీ సదరు డాక్టర్‌ తమ పరిధిలోని పీజీ డాక్టర్‌కుగానీ, హౌస్‌ సర్జన్‌కుగానీ సదరు ఫిల్మ్‌ను లేదా రిపోర్ట్‌ను పంపించి వైద్య సహాయం చేయమని కోరతారు. ఈ విధానం ఓపీలోనూ, ఐపీలోని కొన్ని విభాగాలలో తూ.చా.తప్పక జరుగుతోంది. ప్రస్తుత డాక్టర్‌లలో చాలా మంది రోగులతో మాట్లాడే విధానంకు చాలా వరకు స్వస్తి పలికారు. ఆప్యాయంగా రోగులతో మాట్లాడి వారికి భరోసాను ఇస్తూ, వారి వ్యాధి నివారణకు తమవంతుగా కృషి చేద్దామనే ఆలోచన సన్నగిల్లింది.

సమయపాలనేదీ..?

డాక్టర్లు ఓపీ, ఐపీ విభాగాలలో సమయపాలన పాటించడంలోనూ తీవ్రంగా విమర్శలను ఎదు ర్కొంటున్నారు. ఉదయం 9 గంటలకు ఓపీకి రావాల్సిన డాక్టర్‌లలో కొందరు 10గంటలకుగానీ, 10:30 గంటలకుగానీ వస్తున్నారు. వచ్చిన వారు ఓపికగా వైద్య సేవలను అందించాల్సిందిపోయి హౌస్‌సర్జన్‌లకు, పీజీలకు వదిలేసి తమవంతుగా సెల్‌ఫోన్‌లకుగానీ, ఇతరత్రా పనులలో నిమగ్నమైపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఓపి వైద్యసేవలను అందిస్తున్న డాక్టర్లందరినీ ప్రజలు హర్షిస్తున్నారు. కొందరు మాత్రం ఈ వేళల్లో తమ విధులకు డుమ్మాకొట్టి కడప నగరంలో తాము నిర్మించుకున్న హాస్పిటల్స్‌లో వైద్యసేవలను అందించేందుకు వెళుతున్న వైద్యులను మాత్రం ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ వారిలో మార్పులేదనీ, మంత్రి అయినా తమ సమీక్షలో ఓపీ, ఐపీ సేవల విధానాన్ని ఖచ్చితంగా సమయపాలనను అమలు చేస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

దళారుల చేతివాటం..

దివ్యాంగుల సర్టిఫికెట్‌లను నిక్కచ్చిగా రీ వెరిఫికేషన్‌ చేసి అర్హులైన దివ్యాంగులకే ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాలని కూటమి ప్రభుత్వం ప్రతి ఆసుపత్రిలో ‘రీ వెరిఫికేషన్‌’ ను ప్రారంభించి, కొనసాగిస్తున్నారు. మంచానికే పరిమితమైన, చేతులు, కాళ్లు పనిచేయక తమ కుటుంబసభ్యుల, బంధువుల మీద ఆధారపడి జీవించే వారిని కూడా రీ వెరిఫికేషన్‌కు పిలిపించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనికితోడుగా దళారుల బెడద కూడా ఎక్కువైంది. జిల్లావ్యాప్తంగా, కడప రిమ్స్‌లో కొందరు చిరుద్యోగులతోపాటుగా, పరిపాలనా విభాగంలోని ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్‌లు, కొందరు అటెండర్లు తాము కొందరు డాక్టర్లతో మాట్లాడుకుని రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు అక్రమంగా వసూలు చేసి రీ వెరిఫికేషన్‌ను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఓపీ, ఐపీ విభాగాలలో వైద్య సేవలకోసం వచ్చేవారి సంఖ్య కూడా రోజురోజుకు సన్నగిల్లుతోందని చెప్పుకోవచ్చు. ఓపీకి సరాసరి రోజూ 1600 నుంచి 1800 వరకు వచ్చే వారు సోమ, మంగళ, బుధవారాలలో ఎక్కువగా వస్తున్నారు. గురు, శుక్ర, శనివారాలలో తగ్గుతున్నారు.

నాడు వైఎస్‌ఆర్‌ ఉన్నతాశయం..

దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్‌ ఏర్పాటుచేశారు. నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో నడిపించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సీఎం అయిన ఏడాదిలోనే కడప రిమ్స్‌ ఆవరణలో మూడు వివిధ ప్రదేశాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, మానసిక వైద్యుల ఆసుపత్రికి, కేన్సర్‌ హాస్టిటల్‌కు శంకుస్థాపన నిర్వహించడంతో పాటు తమ పరిపాలన ముగిసేలోపే ఆయా హాస్పిటల్స్‌లలో నిర్మాణ పనులను పూర్తి చేసేలా కృషి చేశారు. 2023 డిసెంబర్‌లో రూ. 322 కోట్ల వ్యయంతో నిర్మించిన 452 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను, 100 పడకల కేన్సర్‌ హాస్పిటల్‌, 100 పడకల మానసిక వైకల్య నివారణ హాస్పిటల్‌ (ఐ.ఎం.హెచ్‌)ల భవన నిర్మాణాలను పూర్తి చేసి రిమ్స్‌ ఆవరణంలో ప్రత్యేక హాస్పిటల్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ను ఇచ్చి అధికారులచే ప్రక్రియను ప్రారంభించారు. ఆ ప్రక్రియ పూర్తి కాకమునుపే ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో నిలిచిపోయాయి. తాజాగా ఇటీవల సూపర్‌ స్పెషాలిటీలో 69 కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ఇచ్చారు. కానీ ఆ పోస్టులైనా తమకు న్యాయబద్ధంగా భర్తీ జరుగుతాయా? లేదా అని నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మిగతా రెండు హాస్పిటల్స్‌లలో కూడా పోస్టుల భర్తీకి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కృషి చేయాలని ఉద్యోగార్థులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.

ఓపీ, ఐపీ విభాగాలలో

రోగులకు తప్పని తిప్పలు

దివ్యాంగుల సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్‌లో దళారుల దందా

సూపర్‌, క్యాన్సర్‌, మానసిక హాస్పిటల్స్‌లలో పోస్టుల భర్తీ జరిగేనా..?

డాక్టర్ల, సిబ్బంది పనితీరు పై పర్యవేక్షణ లోపం

సమయపాలన పాటించని కొందరు వైద్యులు, సిబ్బంది

సమస్యల వలయంలో కడప ‘రిమ్స్‌’ 1
1/2

సమస్యల వలయంలో కడప ‘రిమ్స్‌’

సమస్యల వలయంలో కడప ‘రిమ్స్‌’ 2
2/2

సమస్యల వలయంలో కడప ‘రిమ్స్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement