పీఎం ఆవాస్‌ యోజన కింద గృహాలు మంజూరు | - | Sakshi
Sakshi News home page

పీఎం ఆవాస్‌ యోజన కింద గృహాలు మంజూరు

Jun 18 2025 3:49 AM | Updated on Jun 18 2025 3:49 AM

పీఎం ఆవాస్‌ యోజన కింద గృహాలు మంజూరు

పీఎం ఆవాస్‌ యోజన కింద గృహాలు మంజూరు

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 కింద గృహాలు మంజూరు చేస్తున్నామని జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ వి.రాజరత్నం తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2025 సంవత్సరానికి సంబంధించి గృహాల మంజూరుకు ఆన్‌లైన్‌ ఎంట్రీ జరుగుతోందన్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో కనీసం 750 చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలం ఉన్న పేదలు ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం లాగిన్‌ ప్రొవైడ్‌ చేశామన్నారు. ఇప్పటికే జిల్లాలోని అర్బన్‌ ప్రాంతాల నుంచి 2700 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరికి గృహాలు మంజూరు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలోనే వీరికి గృహాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందులో కేంద్ర వాటా రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.లక్ష ఉంటుందన్నారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు మంజూరు చేస్తుందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు గృహాల మంజూరుకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా లాగిన్స్‌ ఇంకా ప్రొవైడ్‌ చేయాల్సి ఉందని తెలిపారు.

ఇంటి మంజూరుకు అవసరమైన పత్రాలు

ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకునే వారు భార్యాభర్తల ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు వివరాలు, కులం, ఆదాయ సర్టిఫికెట్లు, ఇంటి స్థలం కొనుగోలుకు సంబంధించిన దస్తావేజులు లేదా పొసెషన్‌ సర్టిఫికెట్లు లేదా డి.పట్టా సమర్పించాల్సి ఉంటుందన్నారు.

14వ స్థానంలో జిల్లా

గృహ నిర్మాణంలో ఇప్పటి దాకా 26వ స్థానంలో ఉన్న జిల్లా 14వ స్థానంలోకి వచ్చిందని పేర్కొన్నారు. పీఎం ఆవాస్‌ యోజన 1.0 కింద 2019–24 వరకు జిల్లాలో 99,475 గృహ నిర్మాణాలు చేపట్టామన్నారు. ఇందులో 48,016 (49 శాతం) నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. బేస్‌మెంట్‌ లెవెల్‌లో 30 వేలు, రూ.రూఫ్‌లెవెల్‌లో 10 వేలు, ఆర్‌సీ లెవెల్‌లో 10 వేలు ఉన్నాయన్నారు. ఈనెలాఖరుకు 10,821 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలన్నది లక్ష్యం కాగా, 5000 నిర్మాణాలు మాత్రం పూర్తి చేయగలిగామన్నారు. ఇప్పటికే చేపట్టిన కాలనీల్లో నీరు, రోడ్లు, పైపులైన్‌ కనెక్షన్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు పబ్లిక్‌ హెల్త్‌ డిపార్టుమెంటు చెల్లించాల్సిన రూ.7 కోట్లు పెండింగ్‌లో ఉందన్నారు. ఆ నిధులు మంజూరు చేయాలంటూ రాష్ట్ర ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. నిధులు విడుదలైన వెంటనే మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడతామన్నారు. చాలా కాలనీల్లో వీధి లైట్లు వేయించామని, ఇంకా చాలా చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. అవసరమైన ప్రజలు గృహ నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

అర్బన్‌ ప్రాంతాల్లో 2,700 ఇళ్లు

మౌలిక సదుపాయాలకు రూ.7 కోట్ల

కేటాయింపునకు ప్రతిపాదనలు

హౌసింగ్‌ పీడీ వి.రాజరత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement