
ఇప్పట్లలో అగ్ని ప్రమాదం
లింగాల : లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో యుగంధర్రెడ్డి అనే రైతుకు చెందిన డ్రిప్ ఇరిగేషన్ పైపులు, లాడర్ పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు రూ.4లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధిత రైతు తెలిపారు. వివరాలలోకి వెళితే.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఫీజులు కాలిపోయి అగ్గిరవ్వలు ఎండు గడ్డిపై పడటంతో మంటలు బీడు పొలంలోకి ప్రవేశించడంతో పొలం గట్టున ఉంచిన పైపులు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేశారు. సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు పొందిన రైతుకు అగ్ని ప్రమాదంవల్ల నష్టం సంభవించిందని, దీంతో తిరిగి ఆయనకు సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు.
వృద్ధుడు అదృశ్యం
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణ పరిధికి చెందిన బాణ చిన్న నారాయణరెడ్డి (75) అనే వృద్ధుడు కనిపించడం లేదని కుటుంబీకులు మంగళవారం పట్టణ ఎస్ఐ హైమవతికి ఫిర్యాదు చేశారు. పట్టణానికి చెందిన బాణ చిన్న నారాయణరెడ్డి రోజు మాదిరిగా బయటకు వెళ్లి తిరిగి వచ్చేవాడు. కాగా సోమవారం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు మంగళవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గుర్తు తెలియని (30–35 ఏళ్లు) వ్యక్తి మృతి చెందాడు. ఆస్పత్రిలోని భవనాలకు వెనుక భాగాన గోడకు ఆనుకొని మృతదేహం కనిపించింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి ముఖంపై గాయాలు ఉండటంతో ఎవరైనా హత్య చేసి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ మృతదేహంపై స్పష్టత రానందున మృతుడి వివరాలు తెలియరాలేదు. మృతుడి కోసం ఎవరూ రానందున అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ బివి చలపతి తెలిపారు.

ఇప్పట్లలో అగ్ని ప్రమాదం

ఇప్పట్లలో అగ్ని ప్రమాదం