బ్రహ్మంగారిమఠం : మండలంలోని డి.నేలటూరు పంచాయతీ మలుగుడు పాడు గ్రామ సమీపంలో సర్వేనెంబర్ 571లో వందలాది ఎకరాలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇందులో అధికార టీడీపీకి చెందిన స్థానిక పంచాయతీ నాయకులు ముందు ఉండి ఆక్రమణలకు శ్రీకారం చుడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 2005లో అసైన్మెంట్ కమిటీకి ఉత్తర్వులు ఇవ్వడంతో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ డీయల్ రవీంద్రారెడ్డి డి.నేలటూరు పంచాయతీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఓసీ నిరుపేదలకు ఒక్కొక్కరికి 3 నుంచి 5 ఎకరాల వరకు భూ పంపిణీ చేశారు. డీ పట్టాలు కూడా పొందారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డి.నేలటూరు పంచాయతీ పరిధిలో ఉన్న అధికార పార్టీ నాయకులు నిరుపేదలకు ఇచ్చిన భూములపై పడ్డారు. నాయకులు వాటాలుగా పంచుకొని రాత్రివేళ్లలో బోర్లు వేయడం.. డోజర్లతో చదును చేయడం ప్రారంభించారు. డీ పట్టాలు ఉన్న బీసీలు, ఎస్సీలు అడ్డుకొనేందుకు వెళ్లినా నీ భూమి ఇక్కడ లేదు ఎక్కడో ఉంది అక్కడికి వెళ్లు.. అని భయానికి గురిచేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. వందలాది ఎకరాలు ఆక్రమణలకు గురి అవుతున్నా రెవిన్యూ అధికారులు మాత్రం అటువైపు చూడనట్లు ఉన్నారు.
కాగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైతే చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులకు చెప్పానని అంటున్నారు. మరి ఆయన మాటలు వారు విననట్లు ఉంది. పేదల భూములు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నా చర్యలు మాత్రం శూన్యం.. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
అధికార పార్టీ అండతో నిరుపేదలకు ఇచ్చిన భూముల ఆక్రమణ
దివంగత వైఎస్సార్ ప్రభుత్వంలో
నిరుపేదలకు పట్టాలు
మలుగుడుపాడులో భూఆక్రమణల జోరు