
ఒంటరి మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అనాగరికం
కడప కార్పొరేషన్ : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తన పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అనాగరికమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం దారుణమన్నారు. తన భర్త అప్పులు చేసి పారిపోతే కూలి పనులు చేసుకుంటూ ఆ మహిళ కొద్ది కొద్దిగా అప్పు చెల్లిస్తోందని, అయినా వినకుండా మునికన్నప్ప అనే వ్యక్తి ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లి ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టడం అమానవీయమన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రిగానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రిగానీ స్పందించకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట హింస జరుగుతూనే ఉందన్నారు. జమ్మలమడుగులోని మైలవరంలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేస్తే ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితుని ఇంటిని కూల్చివేశారన్నారు. ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇది నిదర్శనమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు భద్రత కల్పించలేమని ఒక ఎస్పీ ప్రెస్మీట్ పెట్టి విమర్శలు చేయడం దారుణమన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనికి బెయిల్ వస్తే దానిపై మాట్లాడిన హోంమంత్రి, ఇలాంటి ఘటనలపై నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. కుప్పంలో దాడికి గురైన మహిళకు ప్రభుత్వం న్యాయం చేయాలని, లేనిపక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా నేతలు పత్తిరాజేశ్వరి, ఉమామహేశ్వరి, రత్నకుమారి, బి. మరియలు, నారాయణమ్మ, సుశీలమ్మ, తులశమ్మ, చైతల్య, మల్లీశ్వరి, పద్మ పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంలో మహిళలకు
రక్షణ కరువైంది
వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ