
ప్రారంభమైన బదిలీల కౌన్సెలింగ్
కడప రూరల్ : వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో ఉద్యోగుల బదిలీల జూమ్ కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకు జరగనుంది. కౌన్సిలింగ్ను ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య, విజయవాడ నుంచి వచ్చిన పరిశీలకులు రామ్నాధం, భిక్షాలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటసుబ్బమ్మ, జూనియర్ అసిస్టెంట్స్ వనీష, బత్తనయ్య తదితరులు పాల్గొన్నారు.
అంతటా ఆసక్తి..
ఈ శాఖ పరిధిలో రాయలసీమ జిల్లాలు ఉద్యోగులు వస్తారు. వివిధ కేడర్లకు సంబంధించి నిబంధనల ప్రకారం వేలాది మంది ఉద్యోగులను బదిలీ చేయాలి. ఈ సందర్భంగా పలువురు పలుకుబడి..పరపతి ఉన్న ఉద్యోగులు ఉన్నచోటే ఉండడానికి పాకులాడారు. మరికొందరు ఆశించిన సీటు కోసం పోరాటం చేశారు. ఈ నేపధ్యంలో కొందరికి అనూహ్యంగా నిరాశ ఎదురైంది. ఈ పరిణామాలు ఆ శాఖ ఉద్యోగుల్లో ఉత్కంఠ రేపాయి. మొదటి రోజు కౌన్సెలింగ్లో కీలకమైన ఆఫీస్ సూపరింటెండెంట్ స్థానం కోసం కొందరు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లుగా వినికిడి. అలాగే హెల్త్ ఎడ్యుకేటర్కు సంబంధించి బది‘లీలలు’ జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా రెండు రోజుల పాటు జరిగే కౌన్సెలింగ్పై అందరూ దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం బదిలీలు చేపడుతున్నట్లు తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ
కార్యాలయం పరిధిలో
ఉత్కంఠ రేపుతున్న ట్రాన్స్ఫర్స్