
30 లక్షల మంది తల్లులకు కోత
కడప కార్పొరేషన్ : తల్లికి వందనం పథకంలో 30 లక్షల మంది తల్లులకు కోత విధించారని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక మేడా కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, పార్లమెంటు పరిశీలకులు కె. అజయ్రెడ్డి, పార్టీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ ఎస్. రఘురామిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, పి. రామసుబ్బారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, జెడ్పీ ఛైర్మన్ రామగోవిందరెడ్డి, కమలాపురం సమన్వయకర్త నరేన్ రామాంజులరెడ్డి, మాజీ సలహాదారు ఇ. తిరుపాల్రెడ్డిలతో కలిసి ‘జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల హామీలను ఏ రకంగా అమలు చేయాలని వైఎస్ జగన్ ఆలోచిస్తే, ఏ రకంగా తుంగలో తొక్కాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నారని, ఎల్లో మీడియా తప్పా మరే మీడియా ఉండకూడదన్న ఉద్దేశం కనబడుతోందన్నారు. వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో టీడీపీ కార్యకర్తలు రాళ్లు వేస్తే, వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే తిరిగి కేసులు పెట్టారన్నారు. వారిని అసాంఽఘిక శక్తులుగా చిత్రీకరిస్తున్నారని, ఈ ఘోరాలు, నేరాలు, తప్పులను చూపకుండా మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారన్నారు. రాష్ట్రంలో దొంగతనాలు, జూదం, మట్కా, అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా సాగుతోందని, శాంతిభద్రతలను గాలికొదిలేశారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడంలో పోలీసులు బిజీగా ఉన్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో రూ.3.30లక్షల కోట్ల అప్పులు చేయగా, కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదికే రూ.1.58లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. అంత అప్పు చేసి కూడా పథకాలు అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉందన్నారు.
చొక్కాలు పట్టుకోవడం కాదు..
ఊడదీస్తారు: రవీంద్రనాథ్రెడ్డి
అన్నీ లెక్కలు వేసుకున్నాం.. సూపర్ సిక్స్ పథకాలతో పాటు అన్ని సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు చేస్తాం...అలా చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయాలని చంద్రబాబు, లోకేష్ ఎన్నికల్లో చెప్పారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలు వారి చొక్కాలు ఊడదీయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్సీపీ ఉద్యమిస్తేనే తల్లికి వందనం అమలు చేశారని, అందులోనూ సగం మందికి కోత కోశారన్నారు. నాలుగున్నర లక్షల మందికి పింఛన్లు ఎగ్గొట్టారన్నారు. సుపరిపాలన–స్వర్ణాంధ్రప్రదేశ్ అంటూ కేకులు కట్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. అమరావతి పేరుతో రూ.53వేల కోట్లు అప్పులు చేశారన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసమే టెండర్లు పిలిచారన్నారు. వివిధ పథకాలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వం రూ.83వేల కోట్లు ప్రజలకు ఎగనామం పెట్టిందన్నారు.
పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి పాలన
అప్పులు చేస్తున్నా..
పథకాలు అమలు చేయడం లేదు
శాంతి భద్రతలను గాలికొదిలేశారు
‘జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు
అంటే మోసం’ పుస్తకావిష్కరణలో
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి