టిప్పర్‌ చోరీ కేసులో ముగ్గురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

Jun 17 2025 5:22 AM | Updated on Jun 17 2025 5:22 AM

టిప్పర్‌ చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

టిప్పర్‌ చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

మైదుకూరు : మైదుకూరులో శనివారం రాత్రి టిప్పర్‌ చోరీకి గురైన సంఘటనలో సోమవారం మైదుకూరు అర్బన్‌ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్‌ సోమవారం సాయంత్రం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం బ్రహ్మంగారిమఠం మండలం లింగాలదిన్నెపల్లె గ్రామంలో నివాసం ఉంటున్న కాశినాయన మండలం రెడ్డికొట్టాలు గ్రామానికి చెందిన దేశిరెడ్డి ఈశ్వర్‌రెడ్డి కొంత కాలంగా మైదుకూరు మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన చాగంరెడ్డి సాంబశివారెడ్డికి చెందిన టిప్పర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇవ్వాల్సిన జీతం సాంబశివారెడ్డి రూ.29వేలు బకాయి పడ్డాడు. బకాయి సొమ్ము అడిగినా ఇవ్వడం లేదనే కోపంతో డ్రైవర్‌ ఈశ్వర్‌రెడ్డి తన స్నేహితులైన బ్రహ్మంగారిమంఠం మండలం కేవశవాపురం గ్రామానికి చెందిన వేమిరెడ్డి ఓబుళరెడ్డి, రాజుపాళెం మండలం అర్కటవేముల గ్రామానికి చెందిన పోరెడ్డి రామసుబ్బారెడ్డి అనే వారితో కలిసి శనివారం రాత్రి స్థానిక వనిపెంట రోడ్డులో జగన్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ వద్ద పార్కు చేసి ఉన్న సాంబశివారెడ్డికి చెందిన రూ.10లక్షల విలువైన టిప్పర్‌ను దొంగలించుకెళ్లారు. టిప్పర్‌ను విక్రయించి వచ్చిన సొమ్మును ముగ్గురు సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. టిప్పర్‌ను గుంటూరుకు తీసుకెళ్లి విడిభాగాలుగా చేసి విక్రయించాలని పథకం వేసుకున్నారు. అంతవరకు టిప్పర్‌ను ఖాజీపేట మండలం నాగసానిపల్లె వద్ద కంపచెట్లలో దాచి పెట్టారు. తనకున్న ఇంకొక టిప్పర్‌ కేశలింగాయపల్లె వద్ద ఉండగా అక్కడికి వెళ్లి వచ్చేసరికి చోరీకి గురికావడంపై యజమాని చాగంరెడ్డి సాంబశివారెడ్డి ఆదివారం అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిప్పర్‌కున్న జీపీఎస్‌ పరికరాన్ని దుండగులు తొలగించడంతో అర్బన్‌ పోలీసులు దుండగుల కోసం గాలిస్తూ నిఘా ఉంచారు. సోమవారం డ్రైవర్‌ ఈశ్వర్‌రెడ్డి, అతని స్నేహితులు కలిసి టిప్పర్‌ను విక్రయించేందుకు గుంటూరుకు తీసుకుని వెళుతుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో మైదుకూరు – బద్వేలు రోడ్డులో ఉన్న తువ్వపల్లె కూడలి వద్ద అరెస్టు చేసి టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితుల్లో దేశిరెడ్డి ఈశ్వర్‌రెడ్డి గతంలో రెండు హత్యకేసుల్లో, 5 మోటారు బైక్‌ల చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని.. వేమిరెడ్డి ఓబుళరెడ్డి ఒక ఎర్రచందనం కేసు, ట్రాక్టర్‌ చోరీ, రెండు మోటార్‌ బైక్‌ల చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు. టిప్పర్‌ చోరీపై ఫిర్యాదు అందిన వెంటనే నిఘా ఉంచి నిందితులను పట్టుకున్న అర్బన్‌ సీఐ కేవీ రమణారెడ్డి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సిబ్బందికి రివార్డులను అందజేశారు. విలేకరుల సమావేశంలో అర్బన్‌ సీఐ కేవీ రమణారెడ్డి, ఎస్‌ఐ ఎస్‌.సుబ్బారావు, ఏఎస్‌ఐ మురళి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇద్దరు పాత కేసుల్లో నిందితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement