
అటవీ స్థలం ఆక్రమణదారులకు నోటీసులు
ప్రొద్దుటూరు క్రైం : రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్ స్థలంలో నివాసం ఉంటున్న వారికి సోమవారం అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రొద్దుటూరు ఎఫ్ఆర్ఓ హేమాంజలి ఆధ్వర్యంలో అటవీ, రెవెన్యూ అధికారులు కలిసి 3వ నోటీసును అందజేశారు. కొన్ని రోజుల క్రితం వీరికి రెండు నోటీసులను అందజేసిన విషయం తెలిసిందే. నోటీసులు ముట్టిన 15 రోజుల్లోపు సంజాయిషీ, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను అటవీశాఖ అధికారులకు చూపించాల్సి ఉంది. అయితే మొదటి రెండు నోటీసులకు ఆక్రమణదారులు ఎలాంటి డాక్యుమెంట్లను చూపించలేదని అధికారులు చెబుతున్నారు.
ఇదే చివరి నోటీసు..
రామేశ్వరం రిజర్వు ఫారెస్ట్ స్థలంలో పెద్ద ఎత్తున ఇళ్లు వెలిశాయి. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఇళ్లను నిర్మించుకొని వందలాది కుటుంబాలు నివాసాలు ఉంటున్నాయి. కొన్ని ఇళ్లైతే రెండు, మూడు చేతులు కూడా మారాయి. అటవీస్థలం పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైందని, ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణంలోని ఒక న్యాయవాది లోకాయుక్తకు వెళ్లారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అటవీ స్థలాన్ని ఖాళీ చేయించేందుకు ప్రొద్దుటూరు అటవీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే అటవీ– రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. ప్రొద్దుటూరు రేంజ్ పరిధిలో సుమారు 1044 ఎకరాల అటవీభూమి ఉన్నట్లు అధికారిక గెజిట్లో ఉంది. ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి, ప్రొద్దుటూరు రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్లో ఉండాల్సిన అటవీ భూమిలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సర్వే అనంతరం 825 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది. మిగతా 219 ఎకరాలు ఏమైందనేది తేలాల్సి ఉంది. జాయింట్ సర్వే రిపోర్టు తుది నివేదికను అధికారులు నేడో, రేపో కోర్టుకు సమర్పించనున్నారు. కాగా సోమవారం నుంచి 3వ నోటీసును అందించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో నోటీసు జారీ పూర్తి కానున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఇదే చివరి నోటీసు అని, నోటీసు అందిన 15 రోజుల్లోగా అటవీ స్థలంలో ఇళ్లను నిర్మించుకున్న వారు సంజాయిషీతో పాటు తగు డాక్యుమెంట్లను చూపించకుంటే స్థలాన్ని ఖాళీ చేయించేందుకు అఽధికారులు సిద్ధమవుతున్నారు.
35 ఏళ్లుగా నివాసాలు
బైపాస్రోడ్డులోని ముక్తియార్ ఆయిల్మిల్లు వెనుక భాగంలో ఉన్న రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్ స్థలంలో సుమారు 254 ఇళ్లను నిర్మించుకున్నారు. ఇక్కడ 35 ఏళ్ల నుంచి నివాసాలు ఉంటున్నారు. ఈ ప్రాంతంలో పోలింగ్బూత్తో పాటు అంగన్వాడీ కేంద్రం కూడా ఉన్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రతి ఇంటికి డోర్ నంబర్, విద్యుత్ మీటర్ ఉందని, కుళాయి పన్ను కూడా కడుతున్నట్లు తెలిపారు. ఇప్పడు ఉన్నట్టుండి ఎలా ఖాళీ చేస్తామని వారు చెబుతున్నారు.