
విద్యుత్ షాక్తో రైతు మృతి
దువ్వూరు : మండలంలోని ఐ.బయనపల్లె గ్రామంలో విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఐ.బయనపల్లె గ్రామానికి చెందిన బొందెల రాంబాబు (37) పొలం కౌలుకు తీసుకుని పూల పంటను సాగు చేస్తున్నాడు. సోమవారం ఉదయం పొలానికి నీరు కట్టాలని మోటార్ను ఆన్ చేయడానికి స్టార్టర్ స్విచ్ ఆన్ చేయగా విద్యుత్ షాక్తో రాంబాబు అక్కడికక్కడే పడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి నంద్యాల జిల్లా చాగలమర్రిలోని కేరళ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య రాధా, అర్షిత్ (8), అభిరామ్ (7) అనే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు.
డిష్ కేబుల్ మెడకు తగిలి..
వాహనదారుడికి తీవ్ర గాయాలు
అట్లూరు : డిష్ కేబుల్ మెడకు తగిలి ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడిన సంఘటన అట్లూరు మండలం అయ్యప్పస్వామి ఆలయం వద్ద జరిగింది. స్థానికులు, బాధితుని వివరాల మేరకు కొండూరు బీసీ కాలనీకి చెందిన కోడికాళ్ల హరికృష్ణ తన ఇద్దరు కుమారులను ద్విచక్ర వాహనంపై అట్లూరు క్రాస్ రోడ్డుకు తీసుకెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా నిర్మాణంలో ఉన్న అయ్యప్పస్వామి గుడి దగ్గరకు వచ్చే సరికి విద్యుత్తు స్థంభాలపై వేలాడుతున్న డిష్ కేబుల్ హరికృష్ణ మెడకు తగిలి చుట్టుకుంది. దీంతో ద్విచక్రవాహనంపై నుంచి కిందపడి కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. అతని కుమారులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన హరికృష్ణను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

విద్యుత్ షాక్తో రైతు మృతి

విద్యుత్ షాక్తో రైతు మృతి